
వేణుస్వామి వివాదం కొలిక్కి వచ్చింది. నాగచైతన్య-శోభిత పెళ్లికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఈ జ్యోతిష్యుడు, తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు కమిషన్ కు లేఖ సమర్పించాడు.
నాగచైతన్య-శోభిత నిశ్చితార్థం చేసుకున్న వెంటనే సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశాడు వేణు స్వామి. వాళ్లిద్దరి పెళ్లి నిలవదని, ఎక్కువ రోజులు కలిసి కాపురం చేయరని జాతకం చెప్పాడు. దీనిపై చాలామంది భగ్గుమన్నారు. ఇంకా పెళ్లి కూడా చేసుకోకుండా వేణుస్వామి ఇలా మాట్లాడ్డం సరికాదంటూ విమర్శించారు.
జరిగిన ఘటనపై ఫిలిం జర్నలిస్ట్ యూనిట్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. కమిషన్ నోటీసులివ్వగా, దాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించాడు వేణుస్వామి. హైకోర్టులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.
దీంతో మహిళా కమిషన్ మరోసారి ఆయనకు నోటీసులివ్వగా, ఈరోజు కమిషన్ ఎదుట హాజరైన వేణు స్వామి, భేషరతుగా క్షమాపణలు చెబుతూ లెటర్ ఇచ్చారు. మహిళల గౌరవానికి భంగం కలిగేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని స్పష్టం చేసిన కమిషన్, భవిష్యత్తులో ఇలాంటి కామెంట్స్ రిపీట్ చేయకూడదని వేణుస్వామిని ఘాటుగా హెచ్చరించింది.