
యూవీ క్రియేషన్స్ అంటేనే వాయిదాలకు పెట్టింది పేరు అనే రిమార్క్ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఏ హీరోతో ఎలాంటి సినిమా తీసినా, అది సకాలంలో విడుదల అవ్వదని, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై వచ్చే ప్రతి సినిమా వాయిదా పడుతుందనే విమర్శ ఉంది.
ఈ విమర్శను అంగీకరిస్తూనే, దానికి కారణం కూడా చెబుతున్నాడు దర్శకుడు వశిష్ఠ. ప్రస్తుతం ఇదే బ్యానర్ లో విశ్వంభర సినిమా చేస్తున్న వశిష్ఠ, మంచి క్వాలిటీ కోసమే యూవీలో సినిమాలు లేట్ అవుతుంటాయని చెబుతున్నాడు.
“బెటర్ క్వాలిటీ కోసమే యూవీలో సినిమాలు లేట్ అవుతుంటాయి. ‘భాగమతి’ నుంచి బ్యానర్ లో గ్రాఫిక్స్ మొదలయ్యాయి. ఆ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ ఇలా ప్రతి సినిమాకు గ్రాఫిక్స్ వాడారు. అందుకే లేట్ అవుతున్నాయి. ‘మిర్చి’, ‘రన్ రాజా రన్’ లాంటి సినిమాల్లో గ్రాఫిక్స్ పెద్దగా లేవు. అవి వెంటనే రిలీజ్ అయ్యాయి. ‘విశ్వంభర’ కూడా గ్రాఫిక్స్ వల్లనే లేట్ అవుతోంది.”
ఇలా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో సినిమాలు ఎందుకు లేట్ అవుతాయో చెప్పుకొచ్చాడు వశిష్ఠ. అదే టైమ్ లో ‘విశ్వంభర’ విడుదల కూడా మరింత లేట్ అవుతుందనే విషయాన్ని వెల్లడించాడు.
ఇంకా 20 శాతం గ్రాఫిక్స్ పెండింగ్ ఉందని, ఆ గ్రాఫిక్స్ లో క్వాలిటీ చెక్ చేసిన తర్వాతే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని అంటున్నాడు.














