విక్రమ్ సినిమా తంగలాన్ ఆల్రెడీ థియేటర్లలోకి వచ్చి వెళ్లిపోయింది. తమిళ్ లో ఓ మోస్తరుగా ఆడిన ఈ మూవీ, తెలుగులో బ్రేక్ ఈవెన్ అవ్వకుండానే రన్ ముగిసింది. ఎప్పుడైతే ఈ సినిమాను ఓటీటీకి ఇద్దామనుకున్నారో అప్పట్నుంచి కష్టాలు మొదలయ్యాయి.
ముందుగా వచ్చిన పుకారు ఏంటంటే.. థియేట్రికల్ రిజల్ట్ ఆధారంగా ఈ సినిమా ఓటీటీ రైట్స్ విషయంలో నెట్ ఫ్లిక్స్ కొర్రీ పెట్టిందట. భారీ రేటుకు కొనుగోలు చేసిన ఈ సినిమాకు అంత మొత్తం అనవసరం అనేది నెట్ ఫ్లిక్స్ మాటగా చెప్పుకొచ్చారు చాలామంది జనం.
ఓవైపు ఇదిలా నడుస్తుండగానే మరోవైపు సినిమాలో కంటెంట్ పై సదరు ఓటీటీ సంస్థ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు వార్తలొస్తున్నాయి. సినిమాలో గొడ్డు మాంసం తినడం, గేదెను వధించడం లాంటివి నెట్ ఫ్లిక్స్ కు తలనొప్పిగా మారొచ్చని, మరోసారి రీ-ఎడిట్ చేసి, సెన్సార్ చేసి ఇవ్వాలని సదరు సంస్థ కోరినట్టు వార్తలొస్తున్నాయి.
ఇప్పటివరకు చెప్పుకున్నవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమే. కానీ అసలైన అడ్డంకి నిజంగానే మొదలైంది. ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వకుండా ఆదేశించాలంటూ తమిళనాడుకు చెందిన ఓ సామాజిక వేత్త కోర్టుకెక్కాడు. దీంతో ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ పై అనుమానాలు ఇంకా ఎక్కువయ్యాయి.