బాక్సాఫీస్ వద్ద “స్త్రీ” దుమ్ము రేపుతోంది. “స్త్రీ” సినిమాకి సీక్వెల్ గా వచ్చిన “స్త్రీ 2” అట్లాంటి ఇట్లాంటి ఓపెనింగ్ తెచ్చుకోలేదు. ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమాకి మొదటి రోజు ఇండియాలో వచ్చిన కలెక్షన్లను చూసి మొత్తం బాలీవుడ్ పరిశ్రమ, ట్రేడ్ పండితులు నోరు వెళ్ళబెట్టారు.
అవును… ఈ సినిమా మొదటి రోజు ఇండియాలో ఏకంగా 55.40 కోట్లు కొల్లగొట్టింది. అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్ ని చూసి మొదటి రోజు 30 కోట్లు కొల్లగొడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేశారు. కానీ ఏకంగా 55 కోట్ల వసూళ్లు అందుకొంది. ఇది ఎవరూ ఊహించని ఓపెనింగ్.
షారుక్ ఖాన్ కెరీర్ లో అతి పెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచిన “పఠాన్” సినిమా మొదటి రోజు 55 కోట్లు కొల్లగొట్టింది ఇండియాలో. “స్త్రీ 2” నలభై లక్షలు ఇంకా ఎక్కువ వసూళ్లు అందుకొంది. అంటే షారుక్ ఖాన్ సినిమా కన్నా ఒక హారర్ కామెడీకి ఎక్కువ ఓపెనింగ్ రావడం గ్రేట్.
ఈ సినిమాకి ఇంకో ప్రత్యేకత ఏంటంటే… అక్షయ్ కుమార్ నటించిన “ఖేల్ ఖేల్ మే”, జాన్ అబ్రహం నటించిన “వేదా” చిత్రాలతో పోటీపడి ఈ రేంజ్ ఓపెనింగ్ సాధించింది. ఒకవేళ ఈ రెండు పోటీలో లేకుంటే మరో పది కోట్లు కూడా వచ్చేవేమో.
“స్త్రీ” సినిమాకి ఉన్న క్రేజ్ ఇది. మొదటి సినిమా బాగా హిట్ అయింది. దాంతో, ఈ సీక్వెల్ అందరిలో ఆసక్తి రేపింది. చాలా కాలం తర్వాత ఒక బాలీవుడ్ సినిమాకి ఇంత భారీ వసూళ్లు వచ్చాయి. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు హీరో.