సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట తర్వాత ప్రీమియర్ షోలపై డైలమా ఏర్పడింది. ఇకపై తెలంగాణలో ప్రీమియర్స్ కు అనుమతి ఇవ్వమంటూ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటరెడ్డి ప్రకటించారు. అయితే అది ఆయన మౌఖికంగా మాత్రమే చెప్పారు, అధికారికంగా ఆదేశాలు రాలేదు. ప్రీమియర్స్ బ్యాన్ చేస్తారా చేయరా అనే విషయం, మరో పెద్ద సినిమా రిలీజ్ అయితే తప్ప క్లారిటీ రాదు.
ఈ గ్యాప్ లో ఈ అంశంపై రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. తెలంగాణలో ప్రీమియర్స్ షోలు నిషేధించడాన్ని ఖండించాడు ఆర్జీవీ. యాక్సిడెంట్స్ అవుతాయని, రోడ్లపై రాకపోకలు నిషేధిస్తే ఎలా ఉంటుందో, ప్రీమియర్స్ పై తీసుకున్న నిర్ణయం కూడా అలానే ఉందంటూ సెటైర్ వేశాడు.
పెద్దపెద్ద సమావేశాల్లో తొక్కిసలాటలు జరిగిన ఘటనలు చాలానే ఉన్నాయంటూ పెద్ద వికీపీడియా లింక్ ను షేర్ చేసిన వర్మ.. తొక్కిసలాటకు అసలైన కారణాన్ని కనుక్కోవాలి తప్ప, ప్రీమియర్స్ రద్దు చేస్తామనడం సమంజసం కాదని అభిప్రాయపడ్డాడు.
థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రుజువైతే, వాళ్లపై చర్యలు తీసుకోవడంలో తప్పు లేదని.. కానీ దుర్ఘటనకు అల్లు అర్జున్ ను బాధ్యుడ్ని చేయడం మాత్రం హేతుబద్ధంగా లేదని వాదిస్తున్నాడు వర్మ.