హీరో రాజ్ తరుణ్ కు ప్రాణహాని ఉందంటూ అతడి తరఫు లాయర్ నార్సింగి పోలీసుల్ని ఆశ్రయించాడు. పోలీస్ స్టేషన్ కు వెళ్లిన లాయర్ మధు శర్మ, ఆ మేరకు కొన్ని సాక్ష్యాల్ని పోలీసులకు సమర్పించారు. రాజ్ తరుణ్ కు భద్రత కల్పించాలని కోరారు.
“రాజ్ తరుణ్ ను కావాలనే టార్గెట్ చేస్తున్నారు. మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. ఇంటికి వెళ్లి తలుపులు కొడుతున్నారు. రాజ్ తరుణ్ మరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గా మారకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ఓ మంచి హీరో తనకుతాను చనిపోయేంత మానసిక స్థితికి ఆమె చేరుస్తున్నారు. రాజ్ తరుణ్ తెరపైన మాత్రమే కాదు, బయట కూడా రియల్ హీరో. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. అలాంటి వ్యక్తిని డ్రగ్స్ మాఫియా హతమార్చాలని చూస్తోంది.”
తాజాగా ఈ కేసు మరో మలుపు తిరిగింది. లావణ్య తమకు డ్రగ్స్ అలవాటు చేసిందని, డ్రగ్స్ కొనాలంటూ బలవంతం చేస్తోందంటూ ఇద్దరు వ్యక్తులు ఈ రోజు నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
లావణ్యతో తమకు మూడేళ్లుగా పరిచయం ఉందని, ఈమధ్య తరచుగా ఫోన్లు చేసి డ్రగ్స్ కొనుగోలు చేయమని బలవంతం చేస్తోందని, తమ మొబైల్స్ కూడా ఆమె దగ్గరే ఉన్నాయంటూ ప్రీతి, ఉదయ్ అనే ఇద్దరు వ్యక్తులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు.