
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న థియేట్రికల్ సిస్టమ్ గొడవ గురించి అందరికీ తెలిసిందే. మల్టీప్లెక్సుల టైపులో పర్సంటేజీ కావాలని అడుగుతున్నారు సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్లు. అయితే పైకి కనిపించేదంతా ఒకటి, తెరవెనక జరుగుతున్నది మరొకటి.
ఇన్నాళ్లూ లేనిది ఈ అంశం ఇప్పుడే తెరపైకి ఎందుకొచ్చింది? మరీ ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ టైమ్ కే ఈ అంశాన్ని ఎందుకు లేవనెత్తారు? ఏకంగా థియేటర్లు బంద్ చేస్తామనేంత ధైర్యం ఎలా వచ్చింది? ఆ తెగింపు వెనక ఉన్నది ఎవరు?
సినిమా థియేటర్లు యజమానుల చేతుల్లోంచి లీజుదారుల చేతుల్లోకి వెళ్లి చాలా కాలమైంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా హాళ్లను గుప్పిటపెట్టుకొన్నది… ‘ఆ నలుగురే’. థియేటర్లు మాత్రమేనా, పంపిణీ కూడా వాళ్ళదే. అంటే కోట్ల రూపాయలు పెట్టిన నిర్మాత అయినా… ప్రేక్షకులకు సినిమా చూపించాలని హాలు కట్టిన ఎగ్జిబిటర్ అయినా ‘ఆ నలుగురు’ మాటే వినేలా నెట్ వర్క్ సిద్ధం చేసుకున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినీ రంగాన్ని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు.
తమ సినిమాలు ఉన్నప్పుడూ తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ సమస్యలు, ఇబ్బందులు లేవన్నట్లు సాఫీగా వ్యవహారం నడిపిస్తారు. అదే – వాళ్ళకు నచ్చని నిర్మాత, హీరోల చిత్రాలకు ఆటంకాలు కల్పించేలా సమస్యలు పుట్టుకొచ్చేలా చేస్తారు. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో నడుస్తున్న చర్చ ఇదే.
చిత్ర పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం… అభివృద్ధి కోసం అంతా కలసికట్టుగా రావాలని చెప్పిన పవన్ కల్యాణ్ మాటను ఆ కొంతమంది పెడచెవిన పెడుతున్నారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక సినీ నిర్మాతలతో పవన్ కల్యాణ్ సమావేశమై… సానుకూలంగా స్పందిస్తే థియేటర్ల మూతతో ఆయనకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు ఆ కొంతమంది. “ఆ నలుగురు” ఎవరనే చర్చ టాలీవుడ్ లో జోరుగా సాగుతోంది.