కేంద్రంలో ఏర్పడే నూతన ప్రభుత్వం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి భారతరత్న పురస్కారం అందించాలని మాజీ ఎమ్మెల్సీ, ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్ సైట్ కమిటీ చైర్మన్ శ్రీ టి. డి. జనార్థన్ డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఫిల్మ్ నగర్ కల్చరర్ సెంటర్ (ఎఫ్.ఎన్.సి.సి)లో ఎన్టీఆర్ లిటరేచర్, సావనీర్ అండ్ వెబ్ సైట్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి జరిగింది. డా. సోమరాజు, డా బి. ఎన్. ప్రసాద్, డా. డి ఎన్ కుమార్ లతో పాటు ఎన్టీఆర్ వ్యక్తిగత సహాయకులు పి.ఏ శివరామ్, వంటమనిషి బీరయ్య, సహాయ మేకప్ మెన్ అంజయ్య, డ్రైవర్ రమేష్, ఆఫీస్ అటెండెంట్ చంద్రశేఖర్ యాదవ్, ఎన్టీఆర్ అభిమానులు మన్నే సోమేశ్వర రావు, బొప్పన ప్రవీణ్, ఎన్టీఆర్ నఫీజ్, కొడాలి ప్రసాద్, ఈదర చంద్ర వాసులకు కమిటీ చైర్మన్ శ్రీ టి. డి. జనార్థన్ సారధ్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎన్టీఆర్ కుమారుడు శ్రీ నందమూరి రామకృష్ణ, తెలుగు దేశం నాయకులు శ్రీ కనుమూరి రామకృష్ణం రాజు (ఆర్ ఆర్ ఆర్), ప్రముఖ నిర్మాత శ్రీ ఘట్టమనేని ఆదిశేషగిరి రావు, మాజీ ఎంపీ యలమంచిలి శివాజీ, ప్రముఖ నిర్మాత శ్రీ కె. ఎస్ రామారావు, పుండరీ కాంక్షయ్య గారి తనయులు శ్రీ అట్లూరి నాగేశ్వర రావు పాల్గొని శ్రీ ఎన్. టి. రామారావు గారితో తమకున్న అనుబంధాన్ని, సాన్నిహిత్యాన్ని, ఆయనలోని విశిష్ట లక్షణాలను గుర్తు చేస్తూ మాట్లాడారు.
రాబోయో కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ గారికి భారతరత్న పురస్కారం ఇచ్చి ఆయనను సముచితంగా గౌరవించాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానం చేస్తున్నాం అన్నారు జనార్దన్.
“ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఆయన యుగపురుషుడు. ఆయనకు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించాలి,” అని అన్నారు ఎంపీ రఘురామ కృష్ణంరాజు.