
ఇప్పటికే ఓ కోర్టు కేసు వేశారు నాగార్జున. తనపై, తన కుటుంబ సభ్యులపై అనుచితంగా, అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడిన తెలంగాణ మంత్రి కొండా సురేఖపై క్రిమినల్ పరువునష్టం దావా వేశారు. ఇప్పుడీ నటుడు మరో కేసు వేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈసారి అన్వేష్ వంతు.
“ప్రపంచ యాత్రికుడు అన్వేష్” గురించి అందరికీ తెలిసిందే. ఇండియాలోని ప్రముఖ యూట్యూబర్లలో ఒకడు. ఏదో ఒక దేశం తిరగడం, ఆ దేశ విశేషాల్ని తనదైన యాసలో చెప్పి రక్తి కట్టించడం ఇతగాడికి అలవాటు. అలా ఎంతోమంది ఫాలోవర్స్ ను సంపాదించాడు.
ఎప్పుడైతే తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ కలకలం రేగిందో, అప్పుడిక అన్నీ పక్కనపెట్టేశాడు అన్వేష్. బెట్టింగ్ యాప్స్ కు ప్రచారం కల్పించిన వాళ్లను టార్గెట్ చేస్తూ వీడియోలు పెట్టడం మొదలుపెట్టాడు. ఒక దశలో వ్యక్తిగత అంశాలు, వ్యక్తిగత దూషణల వరకు వెళ్లాడు.
ఈ క్రమంలో బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జునపై కూడా నోరు పారేసుకున్నాడు. చివరికి ప్రభుత్వ పెద్దలు, పోలీస్ ఉన్నతాధికారులపై కూడా కామెంట్స్ చేశాడు. దీంతో అన్వేష్ పై కేసు పడింది.
ఇప్పుడీ కేసును మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నాగార్జున రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అన్వేష్ పై స్ట్రాంగ్ గా కేసు ఫైల్ చేసేందుకు నాగ్ రెడీ అవుతున్నారట.