
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఓ క్లాసిక్ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’. మే 9న ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నారు. కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలై 35వ సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు.
మే 9, 1990న జగదేక వీరుడు అతిలోక సుందరి విడుదలైంది. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ కూడా ఈ చిత్రం చెరిపేపింది. రూ. 6 ధర ఉన్న టిక్కెట్ మొదటి మ్యాట్నీ షోకే బ్లాక్ మార్కెట్లో రూ. 210 వరకు అమ్ముడయ్యాయి. అంటే దగ్గరదగ్గరగా 35 రెట్లు అన్నమాట.
జగదేక వీరుడు అతిలోక సుందరిలో మెగాస్టార్ చిరంజీవి టూరిస్ట్ గైడ్గా, లెజెండరీ శ్రీదేవి ఇంద్రజ పాత్రను పోషించారు. ఈ చిత్రంలో అమ్రిష్ పూరి, అల్లు రామలింగయ్య, కన్నడ ప్రభాకర్, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రామి రెడ్డి, బేబీ షాలిని, బేబీ షామిలీ వంటి వారు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు. ఆ కాలంలో అత్యంత ఖరీదైన భారతీయ చిత్రంగా నిర్మాత సి. అశ్విని దత్ తన ప్రతిష్టాత్మక వైజయంతి మూవీస్ బ్యానర్ మీద నిర్మించారు.
మరుపురాని పాటలు
“అబ్బ నీ తీయని దెబ్బ… పాటను ఒక రోజులోపు కంపోజ్ చేశామని తెలిస్తే అంతా ఆశ్చర్యపోతారు. ఇళయరాజా గారు ఉదయం 9 గంటలకు ఆ పాటపై పని చేయడం ప్రారంభించారు. మధ్యాహ్నం 12 లేదా 12:30 గంటల ప్రాంతంలో మాకు ఒక ట్యూన్ ఇచ్చారు. అది రాఘవేంద్రరావు గారు, దత్ గారు, నాకు వెంటనే నచ్చింది. ఆ ట్యూన్ ఎంతో సరళంగా, తియ్యగా అనిపించింది. భోజన సమయంలో వేటూరి గారు సాహిత్యం రాశారు. బాలు గారు దానిని సరదాగా పాడారు” అని అన్నారు చిరంజీవి.
“కథ ప్రకారం హీరో ఒక సామాన్యుడు, హీరోయిన్ ఒక దేవత అని చెప్పాల్సి వచ్చింది. దానిని పాట ద్వారా మాత్రమే సమర్థవంతంగా తెలియజేయగలమని మేము భావించి ‘అందాలలో’ పాటనుపెట్టాం,” అని అన్నారు రాఘవేంద్రరావు.
“‘దినక్కుతా’ పాటను షూట్ చేసే టైంకి చిరంజీవి గారు 106 డిగ్రీల జ్వరంతో ఆయన బాధపడుతున్నారు. ప్రతి షాట్ బ్రేక్ సమయంలో, మేము అతని శరీరాన్ని ఐస్ ప్యాక్డ్ బట్టలతో చుట్టి చల్లపరుస్తూ వచ్చాం. శ్రీదేవి గారి కాల్ షీట్లు మాకు చివరి రెండు రోజులు మాత్రమే ఉన్నందున ఆయన ఆ పాట కోసం చాలా కష్టపడ్డారు. ఆ తర్వాత, ఆమె మరో షూటింగ్ కోసం ఒకటిన్నర నెలలు విదేశాలకు వెళుతోంది. కాబట్టి మేము ఆ రెండు రోజుల్లోనే ఒకే సెట్లో షూటింగ్ పూర్తి చేయాల్సి వచ్చింది. షూటింగ్ తర్వాత చిరంజీవి గారిని వెంటనే విజయ ఆసుపత్రిలో చేర్పించాం. 15 రోజుల తర్వాత ఆయన డిశ్చార్జ్ అయ్యారు,” అని తెలిపారు అశ్వనీదత్.