
“రాజమౌళి మహాభారతం” ప్రస్తావన ఇప్పటిది కాదు. ఇంకా చెప్పాలంటే దాదాపు దశాబ్దానికి పైగా ఈ చర్చ నలుగుతూనే ఉంది. రాజమౌళి కెరీర్ కు గమ్యస్థానం మహాభారతం అనే విషయం అందరికీ తెలిసింది. ఇప్పుడీ ప్రాజెక్టుపై ఒకేసారి ఇద్దరు స్టేట్ మెంట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.
ముందుగా రాజమౌళి దగ్గరకు వద్దాం. “మహాభారతం” ప్రాజెక్టుపై జక్కన్న స్పందించాడు. ఈ సినిమా గురించి ప్రస్తుతం తను ఆలోచించడం లేదని, ఎప్పుడు ఈ ప్రాజెక్టును పట్టాలపైకి తీసుకొచ్చినా అందులో నాని కచ్చితంగా ఉంటాడని వెల్లడించాడు.
అటు రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ కూడా “మహాభారతం”పై స్పందించారు. గతంలో ఓ సందర్భంలో అమీర్ ఖాన్, “మహాభారతం” ప్రాజెక్టు గురించి తనతో చర్చించారని, ఆ తర్వాత ఏమైందో తనకు తెలియదన్నారు. రాజమౌళి అంతిమ లక్ష్యం “మహాభారతం” అని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.
మరోవైపు “మహాభారతం” ప్రాజెక్టుకు సంబంధించి తెరవెనక పనులు సాగుతున్నాయని కూడా అంటున్నారు. 3 భాగాలుగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి, రాజమౌళి టీమ్ లో కొంతమంది డ్రాఫ్టింగ్ పని మీద ఉన్నట్టు సమాచారం.