
‘పాడుతా తీయగా’ (Padutha Theeyaga) వివాదం కొత్త మలుపు తిరిగింది. ప్రారంభంలో గాయని ప్రవస్తి, నిర్వహకులు, జడ్జిల మధ్య మాత్రమే నడిచిన ఈ వివాదం, ఇప్పుడు మెల్లమెల్లగా పొరుగువాళ్లకు కూడా పాకుతోంది. సినిమాల్లో తక్కువ, యూట్యూబ్ లో ఎక్కువగా కనిపిస్తున్న దర్శకుడు గీతాకృష్ణ ఈ వివాదంలో వేలు పెట్టారు.
ఆయన వేలు పెట్టారు అనేకంటే, కాలు పెట్టి పూర్తిగా కెలికి పారేశారు అనడం కరెక్ట్. ప్రవస్తి తన వ్యాఖ్యలతో కీరవాణిపై కొంతమేరకు మాత్రమే ఆరోపణలు చేసింది. గీతాకృష్ణ మాత్రం ఏకంగా హద్దులు దాటేశారు. కీరవాణిని ఉమెనైజర్ గా చెప్పుకొచ్చారు గీతాకృష్ణ.
దీంతో సీనియర్ సంగీత దర్శకుడు కోటి రంగంలోకి దిగాల్సి వచ్చింది. గీతాకృష్ణపై తనకు ఎంతో అభిమానం ఉందంటూనే, ‘ఇలాంటి ఆరోపణలు వద్దమ్మా’ అంటూ సున్నితంగా హెచ్చరించారు. దీంతో ‘పాడుతా తీయగా’ వివాదం మరింత గలీజుగా మారినట్టయింది.
అటు గాయని ప్రవస్తి తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంది. అస్సలు తగ్గేదేలే అన్నట్టు వరుసగా ఇంటర్వ్యూలిస్తోంది.

సునీత మేటర్ ను తప్పుదోవ పట్టిస్తున్నారని, స్లీవ్ లెస్ గురించి తను మాట్లాడలేదని, దాన్ని నిర్వహకులు హైలెట్ చేస్తున్నారని తెలిపింది. తను పొట్టిపొట్టి దుస్తుల గురించి మాట్లాడలేదని, మిడ్-రిఫ్ కనిపించేలా దుస్తులు వేసుకోమని తనకు సూచించారని మరోసారి గుర్తుచేసింది.
ఈ వివాదంతో అటు రామోజీరావు, ఇటు ఎస్పీ బాలు ఆత్మలు ఎంత క్షోభిస్తున్నాయో! ఎందుకంటే వాళ్లిద్దరి మానస పుత్రికే ఈ “పాడుతా తీయగా”. చాలా ఏళ్లపాటు తెలుగునాట గొప్ప కార్యక్రమంగా నిలిచింది ఈ షో. అందరూ ఈ షో కోసం టీవీల ముందు అతుక్కుపోయేవారు. ఆ తర్వాత ఇలా వివాదాలకు కేంద్రబిందువుగా మారింది.