
బాలకృష్ణ హీరోగా నటించిన ‘డాకు మహారాజ్’ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి వచ్చింది. ఈ సినిమా చూసిన వాళ్లకు అందులో తల లేకుండా గుర్రంపై ఉండే ఓ విగ్రహం గుర్తుండే ఉంటుంది. ట్రయిలర్ లో కూడా ఆ విగ్రహాన్ని చూపించారు.
నిజానికి అసలైన ‘డాకు మహారాజ్’ విగ్రహం అదే. ఇప్పుడా విగ్రహం పాత్రతో ‘డాకు మహారాజ్’ కు ప్రీక్వెల్ రాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత నాగవంశీ ప్రకటించాడు.
“డాకు మహారాజ్ కు సీక్వెల్ కాదు, ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నాం. సినిమాలో గుర్రం మీద తల లేకుండా ఓ విగ్రహం ఉంటుంది. దాన్ని హీరోగా చేసి ప్రీక్వెల్ చేద్దామని ట్రై చేస్తున్నాం.”
అసలైన డాకు మహారాజ్ ఎలా ఉండేవాడు? తన ఊరు కోసం అతడు ఏం చేశాడు? ఠాకూర్ల చేతిలో అతడు ఎలా హత్యకు గురయ్యాడు? లాంటి అంశాల్ని అందులో చూపించబోతున్నారు. ఆదివారం రిలీజైన ‘డాకు మహారాజ్’ సినిమాకు బాలయ్య ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.
మరోవైపు సక్సెస్ సంబరాలకు నిర్మాత రెడీ అవుతున్నారు. “తిరుమల ఘటన నేపథ్యంలో అనంతపురంలో తలపెట్టిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను రద్దు చేశాము. అందుకే ఈ వారంలో సక్సెస్ మీట్ ను అనంతపురంలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాం,” అని నాగవంశీ తెలిపారు.