
“భైరవం” అనే సినిమా రానుంది. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరో. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది. మొన్నటివరకు జనం ఈ సినిమాని పక్కా తెలుగు సినిమా అనుకున్నారు. కానీ టీజర్ వచ్చాక ఇది రీమేక్ అని అర్థమైంది.
తమిళ్ లో గతేడాది విడుదలైన చిత్రాల్లో మంచి విజయం సాధించిన చిత్రాల్లో ఒకటి… గరుడన్. కమెడియన్ సూరి హీరోగా మారిన తర్వాత నటించిన రెండో చిత్రం. సూరికి మిత్రులుగా శశికుమార్, ఉన్ని ముకుందన్ నటించారు. ఒక ఊరిలో జరిగే కథ. ముగ్గురు మిత్రుల చుట్టూ తిరిగే ఈ సినిమాలో సూరి అనాధగా నటించారు. ఇతర ఇద్దరు మిత్రులు అతన్ని చేరదీసి తమవాడిగా చేసుకుంటారు. దాంతో ఆ మిత్రుల కోసం ఎంతకైనా తెగించే వాడిగా సూరి మారుతాడు.
“భైరవం” కథ ఇదే అని టీజర్ ని బట్టి అర్థమవుతోంది. సూరి పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించాడు. శశికుమార్, ఉన్ని ముకుందన్ పాత్రలని మంచు మనోజ్, నారా రోహిత్ చేస్తున్నారు. వడివుక్కరసి నటించిన బామ్మ పాత్రని ఇక్కడ జయసుధ పోషిస్తున్నారు.
“నాంది”, “ఉగ్రం” వంటి సినిమాలు తీసిన విజయ్ కుమార్ కనకమేడల ఇప్పుడు విజయం కోసం రీమేక్ ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.