
సీనియర్ హీరోలు తమ కూతుళ్లకు తమ సినిమాల్లో వాటాలు ఇస్తున్నారు. కూతుళ్లను నిర్మాతలుగా ఎంకరేజ్ చేస్తున్నారు బాలయ్య, చిరంజీవి.
చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత మొదట తన తండ్రికి స్టైలిస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్ అనే బ్యానర్ పెట్టి నిర్మాతగా సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నారు. ఒక చిన్న సినిమా, ఒక వెబ్ సిరీస్ నిర్మిస్తే అవి ఆడలేదు. దాంతో, ఆమెని నిర్మాతగా ఆదుకునేందుకు చిరంజీవి ముందుకొచ్చారు. చిరంజీవి తదుపరి చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. హిట్ చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకుడు.
చిరంజీవి – అనిల్ రావిపూడి చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించనున్నారు. ఈ సినిమాకి సహ నిర్మాతగా సుస్మిత చేరారు. ఆమె డబ్బులు పెట్టేది లేదు. తండ్రి చిరంజీవి డేట్స్ ఆమె వద్ద ఉన్నాయి. అనిల్ రావిపూడి సాహుకి చెయ్యాలి. అలా సుస్మిత ఈ సినిమాలో పెట్టుబడి లేని సహ నిర్మాతగా మారిపోయారు. బిజినెస్ లో ఆమెకి వాటా ఉంటుంది.
చిరంజీవి కన్నా ముందే నందమూరి బాలకృష్ణ ఇదే సూత్రాన్ని పాటించారు. బాలయ్య చిన్న కూతురు తేజస్విని కొంతకాలంగా ఆయన సినిమాల ప్లానింగ్ చేస్తున్నారు. తాజాగా ‘అఖండ 2’ సినిమాకి సహ నిర్మాత అయ్యారు. “అఖండ 2” చిత్రాన్ని రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తేజస్విని ప్రెజెంటర్. తండ్రి ఆమెకి ఈ సినిమాలో వాటా ఇచ్చారు.