
ఉపేంద్ర సినిమాలంతే. కొందరికి ఓ పట్టాన అర్థంకావు. మరికొందరికి అర్థమౌతాయి. గతేడాది డిసెంబర్లో విడుదలైన ‘యుఐ’ (UI) అనే సినిమా కూడా అదే కోవకు చెందింది. థియేటర్లలో ఈ సినిమా ఫ్లాప్ అయింది, అయినా చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఈ సినిమా కథపై స్పందించాడు ఉప్పీ.
“ఆ సినిమా జనాలకు అర్థమవ్వడం చాలా కష్టం. ఆ విషయం నాకు తెలుసు. నేను ఏడేళ్ల నుంచి చెబుతూనే ఉన్నాను. ఈ సినిమాలో ఇంకాస్త స్ట్రాంగ్ గా చెప్పాను. నాకు తెలిసి మరో ఐదారేళ్ల తర్వాత ఈ సినిమా జనాలకు అర్థమౌతుంది.”
‘యుఐ’ సినిమాలో థియేటర్లలో కూర్చొని సినిమా చూసే ప్రేక్షకుల్నే విలన్లు అని చెప్పే ప్రయత్నం చేశాడు ఉపేంద్ర. దాన్ని జీర్ణించుకోవడం ప్రేక్షకులకు కాస్త కష్టమైందని, తెరపై విలన్ కోసం వెదికిన ఆడియన్స్ కు తామే విలన్ అని చెప్పేసరికి అర్థం చేసుకోలేకపోయారని అన్నాడు ఉపేంద్ర.
తెలివైన వాళ్లు కూర్చోండి, తెలివితేటలు లేనోళ్లు దయచేసి థియేటర్ల నుంచి వెళ్లిపోండి అంటూ సినిమా ప్రారంభంలోనే కార్డు వేశాడు ఉపేంద్ర. అదే నిజమైంది.