భారీ పెంపు.. తక్కువ పెంపు.. ఇంకాస్త తక్కువ
సంక్రాంతి సినిమాలకు టికెట్ రేట్లు సవరించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ నుంచి 3 సినిమాలకు సంబంధించిన 3 జీవోలు ఒకేసారి బయటకొచ్చాయి. వీటిలో ‘గేమ్ ఛేంజర్’ కు భారీగా టికెట్ రేట్లు పెంచగా.. ‘డాకు మహారాజ్’కు గేమ్ ఛేంజర్ కంటే తక్కువగా రేట్లు పెంచారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు ఇంకాస్త తక్కువగా రేట్లు పెంచారు. ఆ వివరాలు చూద్దాం..
గేమ్ ఛేంజర్ కు ఒంటి గంట మిడ్ నైట్ షోకు ఏపీ సర్కారు అనుమతినిచ్చింది. ఈ ఒక్క షోకు టికెట్ రేటు 600 రూపాయలు పెట్టుకోవచ్చని తెలిపింది. ఈ విషయంలో లోవర్ క్లాస్, అప్పర్ క్లాస్ అనే తేడా లేదు.
ఇక విడుదల రోజు నుంచి 13 రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ రేటుపై 135 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో 175 రూపాయల వరకు పెంచుకోవచ్చని తెలిపింది. షోల విషయానికొస్తే, మొదటి రోజు 6 షోలు, రెండో రోజు నుంచి 12 రోజుల పాటు రోజుకు 5 షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది.
‘గేమ్ చేంజర్’తో పోలిస్తే ‘డాకు మహారాజ్’కు తక్కువ స్థాయిలో పెంపు జరిగింది. ఈ సినిమాకు ఉదయం 4 గంటల షోకు అనుమతినిచ్చారు. ఈ ఒక్క షోకు 500 రూపాయల టికెట్ రేటు పెట్టుకోవచ్చు. ఇక రిలీజ్ రోజు నుంచి 13 రోజుల పాటు రోజుకు 5 షోలకు అనుమతిచ్చారు. సింగిల్ స్క్రీన్స్ లో 110 రూపాయలు, మల్టీప్లెక్సుల్లో 135 రూపాయల వరకు టికెట్ పై రేటు పెంచుకోవచ్చని తెలిపారు.
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతినివ్వడం విశేషం. పై రెండు సినిమాలతో పోలిస్తే, ఈ సినిమాకు మరింత తక్కువ పెంపు ఇచ్చారు. సింగిల్ స్క్రీన్స్ లో వంద రూపాయలు, మల్టీప్లెక్సుల్లో 125 రూపాయలు పెంచుకునేందుకు అనుమతి ఇస్తూ జీవో రిలీజ్ చేశారు.
మొత్తానికి సంక్రాంతి సినిమాలన్నింటికీ టికెట్ రేట్లు పెరిగాయి. ప్రతి సినిమాకు విడుదల రోజు నుంచి 13 రోజుల వరకు పెంచిన టికెట్ రేట్లే ఉంటాయి. పండక్కి ఫ్యామిలీతో సినిమా చూద్దామనుకుంటే దబిడి దిబిడే.