నిజం చెప్పాలంటే “కేజీఎఫ్” బ్యూటీ శ్రీనిధి శెట్టి ఎక్కడో ఉండాల్సిన భామ. “కేజీఎఫ్”, “కేజీఎఫ్ 2″లు దేశమంతా అన్ని భాషల్లో ఆడాయి. మన దేశంలో అతిపెద్ద హిట్ చిత్రాల్లో “”కేజీఎఫ్ 2” ఒకటి. అంత భారీ హిట్ మూవీలో నటించినా శ్రీనిధికి భారీ మూవీస్ దక్కకపోవడం విచిత్రం.
ఆమెకి సొంత చిత్ర పరిశ్రమ “కన్నడ సినిమా”లో కూడా పెద్దగా ఆఫర్లు రాలేదు. తమిళంలో రెండు సినిమాలు చేసింది. కానీ అవి కలిసి రాలేదు. బాలీవుడ్ నుంచి పిలుపు రావడం లేదు. దాంతో, ఈ భామ ఇప్పుడు ఫోకస్ టాలీవుడ్ పై పెట్టింది.
ఆమె తనకు తాను ఎక్కువ ఊహించుకోవడం, భారీగా పారితోషికం డిమాండ్ చెయ్యడం వల్లే అవకాశాలు పెద్దగా రాలేదు అనేది ఒక మాట. ఆ సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం ఆమె తెలుగులో రెండు అవకాశాలు దక్కాయి.
సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా దర్శకురాలు నీరజ కోన “తెలుసు కదా” అనే సినిమా తీస్తోంది. ఆమెకి ఇది మొదటి చిత్రం. ఈ సినిమాలో సిద్ధూ సరసన రాశి ఖన్నాతో పాటు శ్రీనిధి నటిస్తోంది. ఈ వారమే షూటింగ్ మొదలైంది. ఇప్పటికే రాశి ఖన్నా షూటింగ్ లో పాల్గొంటోంది. వచ్చే వారం శ్రీనిధి కూడా షూటింగ్ లో పాల్గొంటుంది.
అలాగే, రానా నిర్మాతగా తీస్తున్న ఒక కొత్త సినిమాలో కూడా శ్రీనిధి నటించనుంది. సో, శ్రీనిధి తెలుగు యువ హీరోలు, మిడ్ రేంజ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది అన్నమాట.