
నటి పూనమ్ కౌర్ మరోసారి పాత ఆరోపణలను కొత్తగా చేసింది. కొన్ని గ్యాంగ్స్ తనను ఇండస్ట్రీ నుంచి తప్పుకునేలా చేశాయని ఆరోపించింది.
నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ వచ్చిన సందర్భంగా ఆమె బాలయ్యకి శుభాకాంక్షలు తెలిపింది. సింపుల్ గా ‘జై బాలయ్య’ అనే స్లోగన్ ఇచ్చింది. అదే కామెంట్ సెక్షన్ లో ఇప్పుడేం చేస్తున్నారు అనే ప్రశ్న ఎదురైంది ఆమెకు. దీనిపై స్పందించిన పూనమ్, ఒకప్పుడు తను సినిమాలు చేసేదాన్నని, కొన్ని బ్యాచుల వల్ల సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని ఆరోపించింది.
మరోవైపు ఇదే అంశంపై ఆమె మూవీ ఆర్టిస్ట్ అసొసియేషన్ కు ఫిర్యాదు చేశానని చెబుతోంది. అయితే అసోసియేషన్ మాత్రం తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదంటోంది. ఆఫీస్ కొచ్చి లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలని కోరుతోంది. ప్రస్తుతం ఇదే విషయంపై ఆలోచన చేస్తోంది పూనమ్ కౌర్.
వాదన వినిపించడానికి తనకు మహిళా ప్యానెల్ కావాలని ఆమె కొన్ని రోజుల కిందట డిమాండ్ చేసింది. దీనిపై అసోసియేషన్ ఇంకా స్పందించలేదు.