హీరోయిన్ కావ్య థాపర్ కి పెద్దగా క్రేజ్ లేదు. కానీ ఆమెకి అవకాశాలు మాత్రం చాలానే వస్తున్నాయి. అందాల ఆరబోతలో ఏ మాత్రం పొదుపు పాటించని భామ.
ఈ భామ ఇప్పుడు ఇంకో సినిమాతో మనల్ని పలకరించనుంది. ‘దూకుడు’ వంటి సెన్సేషనల్ హిట్ చిత్రాలు తీసిన డైరెక్టర్ శ్రీను వైట్ల తీస్తున్న కొత్త సినిమాలో ఈ భామ హీరోయిన్. గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల రూపొందిస్తున్న ‘విశ్వం’ దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల కానుంది. అంటే ఈ సినిమా ఈ ఏడాది ఆమెకి నాలుగోది.
ఈ ఏడాది కావ్య థాపర్ రవితేజ సరసన “ఈగిల్” అనే చిత్రంలో కనిపించింది. ఫిబ్రవరిలో విడుదలైన “ఈగిల్” ఆడలేదు. ఆ తర్వాత అదే నెలలో విడుదలైన “ఊరు పేరు భైరవకోన”లో కూడా నటించింది. అది ఓ మోస్తరు విజయం సాధించింది. ఇక గత నెలలో పూరి తీసిన “డబుల్ ఇస్మార్ట్”లో రామ్ సరసన నటించింది. అది ఘోర పరాజయం పాలైంది.
ఇప్పుడు ‘విశ్వం’తో నాలుగోసారి ఈ ఏడాది మన ముందుకొస్తోంది.
“గోపిచంద్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా అనందంగా వుంది. ఈ సినిమా చాలా జాయ్ ఫుల్ జర్నీ,” అని కూడా చెప్తోంది ఈ భామ. మరి ఈ సినిమా అయినా ఆమెకి క్రేజ్ తెస్తుందా అనేది చూడాలి.