18 ఏళ్లుగా బాలీవుడ్ లో కొనసాగుతున్న కంగనా రనౌత్, నటిగా ఉండడం తనకు అసహ్యం అని ప్రకటించి అందరికీ షాకిచ్చింది. మరి ఇన్నేళ్లు ఎలా కొనసాగారు అని అడిగితే, జీవితంలో చాలా టైమ్ వేస్ట్ అయిందని చెప్పుకొచ్చింది.
“మీకు తెలుసా. నటిగా ఉండడం నాకు అసహ్యం. మామూలు అసహ్యం కాదు, పరమ అసహ్యం. ఎందుకనేది నేను సూటిగా చెప్పలేను. సెట్స్ కు వస్తే ఏం జరుగుతుందో చూడ్డానికే సరిపోతుంది. నా జీవితంలో చాలా సమయం వృధా అయింది. మనందరికీ చాలా తక్కువ టైమ్ ఉంది. ఆ ఉన్న టైమ్ సెట్స్ లో వేస్ట్ అవుతుంది.”
షాట్ రెడీ అని అసిస్టెంట్ డైరక్టర్ చెబుతాడు, లేచి నిల్చొనే లోపే ఆగండి.. అంటాడట. మెయిన్ లీడ్ గా చేసిన సినిమాల్లో కూడా ఇదే పరిస్థితని చెబుతోంది కంగన. ఇలా తన జీవితంలో చాలా సమయం వృధా అయిందని అంటోంది.
మరి ఆమెకు ఏం ఇష్టం?
డైరక్టర్ గా ఉండడం ఇష్టం అంట. ఎందుకంటే ప్రతి నిమిషం ఆలోచిస్తామంట. ప్రతి నిమిషం చేతిలో పని ఉంటుందట. అలాంటి పని చేయడానికి తను ఇష్టపడతానని, షాట్ రెడీ అయ్యేంతవరకు కుర్చీలో కూర్చోవడం అసహ్యం అంటోంది.
ఆమె డైరెక్ట్ చేసిన “ఎమెర్జెన్సీ” సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సో… ఈ సినిమా ప్రమోషన్లో ఇలా మాట్లాడింది. ఈ సినిమాలో కంగన ఇందిరాగాంధీగా నటించింది.