
ఇది ఎన్నికల సమయం. పలువురు హీరోలు, హీరోయిన్లు వివిధ పార్టీల తరఫున ఎన్నికల బరిలో దిగారు. మరికొందరు ప్రచారం చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కూడా ఎన్నికల్లో పోటీ చెయ్యబోతున్నారు అనే మాట మొదలైంది.
సంజయ్ దత్ తండ్రి సునీల్ దత్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఐతే, సంజయ్ దత్ మాత్రం మహారాష్ట్రకు చెందిన ఓ పార్టీ తరఫున పోటీ చెయ్యబోతున్నారు అని ప్రచారం జరిగింది. దాంతో ఆయన ఈ పుకార్లకు తెరదించారు.
“నేను రాజకీయాల్లోకి వస్తున్నాను అన్న పుకార్లకు ముగింపు వేయండి. నేను ఏ పార్టీలో చేరడం లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఒకవేళ నేను రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకుంటే ఆ విషయాన్ని నేను స్వయంగా ప్రకటిస్తాను. దయచేసి ప్రస్తుతం నా గురించి వస్తున్న వార్తలను నమ్మకండి.,” అని సంజయ్ దత్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
ప్రస్తుతం సంజయ్ దత్ సినిమాలతో బిజీగా ఉన్నారు. “కేజీఎఫ్ 2” సినిమా ఘన విజయం తర్వాత ఆయనకి తెలుగు, తమిళ భాషల్లో డిమాండ్ పెరిగింది. కోలీవుడ్ లో ఇప్పటికే ఆయన విజయ్ హీరోగా నటించిన “లియో”లో విలన్ గా నటించారు.
ఇక తెలుగులో ఆయన రామ్ హీరోగా పూరి తీస్తున్న “డబుల్ ఇస్మార్ట్”లో నటిస్తున్నారు. తాజాగా రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తీస్తున్న సినిమా కూడా సైన్ చేశారు.