
కొన్ని కథలు కనెక్ట్ అయితే అలానే ఉంటుంది. ఎదురుగా వందల కోట్ల బడ్జెట్ ఉన్నా, స్టార్ హీరో కనిపిస్తున్నా, సినిమా చేయాలనిపించదు. మనసులో నాటుకుపోయిన కథతోనే సెట్స్ పైకి వెళ్లాలనిపిస్తుంది. చందు మొండేటి కూడా అదే టైపు.
‘కార్తికేయ-2’ బిగ్ సక్సెస్ తర్వాత చందు మొండేటికి ఊహించని ఆఫర్ వచ్చింది. అది కూడా మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నుంచి. చందు మొండేటిని పిలిచి ఆయన ఒకటే చెప్పారంట. “కథ ఎంత పెద్దదైనా సిద్ధం చేసుకో.. బడ్జెట్ 300 కోట్లు అయినా పర్వాలేదు.. హీరోగా రామ్ చరణ్ లేదా సూర్యను ఎవరినైనా తీసుకో”
ఇది అరవింద్ నుంచి చందు మొండేటికి వచ్చిన ఆఫర్. కానీ అప్పటికే ‘తండేల్’ స్టోరీలైన్ విన్న మొండేటి దానికి బాగా కనెక్ట్ అయిపోయాడంట. ఆ కథ డాక్యుమెంటరీలా ఉందని ఓవైపు అరవింద్ నో చెప్పినా కూడా చందు మాత్రం తగ్గలేదంట.
‘తండేల్’ను పూర్తిస్థాయి కథగా మలిచి అరవింద్ కు వినిపించిన తర్వాత ఆయన ఓకే చెప్పారట.
ఆ కథ రాసుకున్నప్పుడే నాగచైతన్య-సాయిపల్లవి అయితే బాగుంటుందని ఫిక్స్ అయ్యానని, అలా 300 కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాను వదులుకున్నానని అన్నాడు.