
మహేష్ బాబు, ప్రియాంక చోప్రాతో ఒప్పందాలు పక్కాగా చేసుకున్నారట రాజమౌళి టీం. ఎందుకంటే రాజమౌళి ఒక సినిమాని ఎన్ని నెలల్లో పూర్తి చేస్తారో చెప్పలేం. ఆయనకి కూడా క్లారిటీ ఉండదు. తాను అనుకున్నట్లు వచ్చేంతవరకు రాజీపడరు రాజమౌళి. అందుకే ఆయన సినిమాలు అంత పెద్ద హిట్ అవుతాయి. ఐతే, మహేష్ బాబు ఎక్కువగా విదేశాలకు వెళ్లే అలవాటు ఉంది. టైం దొరికితే రిలాక్స్ అవుతుంటారు.
“గుంటూరు కారం” సినిమా మొదలు అయి పూర్తి అయ్యేలోపు మహేష్ బాబు ఐదు సార్లు విదేశాలకు ట్రిప్పులు వేశారు. ఈ విషయం తెలిసే తన సినిమా పూర్తి అయ్యేవరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉండాలని రాజమౌళి ముందే ఒప్పందం చేసుకున్నారట. మహేష్ బాబు పాస్ పోర్ట్ ని లాక్కున్నట్లు సినిమా మొదలయ్యే ముందు రాజమౌళి ఫన్నీగా వీడియో పోస్ట్ చేశారు. అంటే మహేష్ బాబు ఎప్పుడు పడితే ఫారిన్ ట్రిప్పులు వెయ్యకుండా చూస్తున్నాను అని హింట్ ఇచ్చారు. దానికి సమాధానంగా ఒక్కసారి కమిట్ ఐతే నా మాట నేనే వినను అని మహేష్ బాబు ఫన్నీగా సమాధానం ఇచ్చారు.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. ఇక ప్రియాంక చోప్రాతో కూడా పక్కాగా ఒప్పందాలు చేసుకున్నారు. ఆమె అమెరికన్ వెబ్ డ్రామాల్లో, హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తుంటారు. ఐతే, తన స్టయిల్ ప్రకారం ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి అని, ఇన్ని రోజుల డేట్స్ మాత్రమే ఇస్తాను అనే కండీషన్స్ ఉండొద్దు అని ఆమెతో అగ్రిమెంట్ రాయించుకున్నారు. ఆమె ఆనందంగా ఒప్పుకొంది.
రాజమౌళి తాజా చిత్రం హాలీవుడ్ వెర్షన్ కూడా విడుదల కాబోతోంది. భారీ అంతర్జాతీయ చిత్రంగా తీస్తున్నారు.