
రానా నుంచి సినిమా వచ్చి చాన్నాళ్లయింది. ఈమధ్య “కల్కి” సినిమాకు ప్రచారం చేస్తున్నాడు తప్ప, తన సినిమా సంగతులు చెప్పడం లేదు ఈ ఆజానుబాహుడు. ఆమధ్య తేజ దర్శకత్వంలో సినిమా ప్రకటించాడు రానా. దానికి “రాక్షస రాజు” అనే పేరు కూడా పెట్టారు. కానీ ఆ మూవీ మేటర్ ఎటూ తేలలేదు.
అంతకంటే ముందు హిరణ్యకశ్యప ప్రకటించాడు. అది కూడా హోల్డ్ లో పడినట్టు కనిపిస్తోంది. ఇప్పుడీ హీరో మరో సినిమా ప్రకటనతో రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. కొత్త దర్శకుడితో సినిమాకు రానా ఓకే చేసినట్టున్నాడు. బాహుబలి నిర్మాతలు ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్ పై ఈ సినిమా చేయబోతున్నారు.
ఇప్పుడీ సినిమాలో హీరోయిన్ గా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టిని తీసుకునే ఆలోచనలో ఉన్నారు.
ఈ ముద్దుగుమ్మ ఆల్రెడీ తెలుగులో “తెలుసు కదా” అనే సినిమాలో నటిస్తోంది. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తి కావొస్తోంది. ఇప్పుడు రానా సినిమా కూడా ఓకే ఐతే ఆమెకి మరిన్ని ఆఫర్లు రావడం ఖాయం.

కేజీఎఫ్ తర్వాత శ్రీనిధి శెట్టికి సరైన సినిమాలు పడలేదు. నిజానికి ఆమెకు క్రేజీ ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె డిమాండ్ చేసిన పారితోషికం చూసి చాలామంది వెనక్కు వెళ్లిపోయారు. అలా కెరీర్ లో గ్యాప్ ఎదుర్కొన్న ఈ బ్యూటీ, ఇప్పుడిప్పుడే కొన్ని సినిమాలకు సైన్ చేస్తోంది.