
నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ మరోసారి నోరు పారేసుకున్నాడు. సమీక్షకులపై ఇంకోసారి తీవ్ర విమర్శలు చేశాడు. గతంలో ‘పొట్టేల్’ అనే సినిమా ప్రచారంలో రివ్యూయర్స్ పై అత్యంత నీచమైన కామెంట్స్ చేసిన ఈ వ్యక్తి, ఈసారి ‘రాచరికం’ అనే సినిమా ప్రచారంలో మరింత ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
గతంలో సినీ సమీక్షకులపై ఘాటు విమర్శలు చేశానని, ఈసారి మరింత ఘాటుగా విమర్శలు చేయడానికి ఫిక్స్ అయ్యానని ప్రకటించి మరీ తిట్ల పురాణం అందుకున్నాడు. కేవలం డబ్బుల కోసమే రివ్యూలు రాస్తారని, అలాంటి వాళ్లంతా ఇనస్టాగ్రామ్ లో తమ నంబర్లను డీఎం చేస్తే, వాళ్లకు డబ్బులిస్తానని అన్నాడు అయ్యంగార్.
డబ్బుల కోసం పాకులాడే సమీక్షకుల్ని ఎంకరేజ్ చేయొద్దని, డబ్బులు పెట్టి సినిమాలు తీసే నిర్మాతల్ని ప్రోత్సహించాలని పిలుపునిస్తున్నాడు ఈ నటుడు. ప్రేక్షకులకు ఒక సినిమా నచ్చకపోతే మరో సినిమాతో ముందుకొస్తామని, అంతేతప్ప, పరిశ్రమను నాశనం చేసే సమీక్షకుల్ని మధ్యలోకి రానివ్వొద్దని ఆడియన్స్ ను కోరాడు.
గతంలో అతడు చేసిన వ్యాఖ్యలతో ‘పొట్టేల్’ సినిమాను అనధికారికంగా బ్యాన్ చేసింది మీడియా. కంటెంట్ బాగున్నప్పటికీ శ్రీకాంత్ అయ్యంగార్ వల్ల ఆ సినిమా చాలా నష్టపోయింది. ఇప్పుడు ‘రాచరికం’ సినిమా యూనిట్ కూడా అతడ్ని ఆహ్వానించింది.