
తెలంగాణాలో ఇక టికెట్ రేట్లు పెంచబోమని అసెంబ్లీలో ప్రకటన చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ తర్వాత పది రోజులకే “గేమ్ చేంజర్” సినిమాకి టికెట్ రేట్లు పెంచారు. దాంతో సోషల్ మీడియాలోనూ, ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి ట్రోలింగ్ ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరోసారి యూటర్న్ అయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.
“గేమ్ చేంజర్” టికెట్ రేట్ల పెంపు కోసం ఇచ్చిన ప్రత్యేక అనుమతి జీవోని రేవంత్ రెడ్డి సర్కారు వెనక్కు తీసుకుంది. గేమ్ ఛేంజర్ కోసం టికెట్ రేట్లను పెంచకుండా, సాధారణ టికెట్ రేట్లకే సినిమాను ప్రదర్శించాలంటూ రివైజ్ జీవో జారీ చేసింది.
అయితే ఈ నిర్ణయం ‘గేమ్ ఛేంజర్’పై పూర్తి ప్రభావం చూపించదు. ఎందుకంటే, ఈ జీవో 16వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. అంటే, గేమ్ ఛేంజర్ సినిమాకు నైజాంలో 6 రోజుల పాటు టికెట్ పెంపు ఇచ్చినట్టయింది. 7వ రోజు నుంచి సాధారణ టికెట్ రేట్లకే ఈ సినిమాను ప్రదర్శించాల్సి ఉంటుంది.
టికెట్ రేట్లు పెంచాలంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలంటూ, తెలంగాణ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ప్రభుత్వం తమ జీవోను ఉపసంహరించుకుంది. అంతేకాదు, ఇకపై తెలంగాణలో ఏ సినిమాకు ఎర్లీ మార్నింగ్ షోలు/బెనిఫిట్ షోలు ఉండవని కూడా స్పష్టం చేసింది.
అటు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తన నిర్ణయాన్ని వెలువరించిన సంగతి తెలిసిందే. “గేమ్ ఛేంజర్,” “డాకు మహారాజ్,” “సంక్రాంతికి వస్తున్నాం”తో సహా అన్ని సంక్రాంతి సినిమాలకు మిడ్ నైట్ షోలు, తెల్లవారుజామున 4 గంటల షోకు అనుమతులు రద్దు చేసింది.