
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తమిళ అగ్ర దర్శకుడు లోకేష్ కనగరాజ్ తీస్తున్న “కూలీ” చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొంది. చాలా వేగంగా ఈ సినిమాని రజినీకాంత్ పూర్తి చేశారు. అలాగే, పలువురు పెద్ద హీరోలు ఇందులో నటిస్తున్నా, దర్శకుడు లోకేష్ పక్కా ప్లానింగ్ తో సినిమాని తక్కువ టైంలో పూర్తి చెయ్యడం విశేషం.
ఈ విషయాన్నీ చెప్తూ నిర్మాణ సంస్థ సన్ పిక్షర్స్ తాజాగా ఒక వీడియో విడుదల చేసింది.
రజినీకాంత్ ఈ సినిమాలో మెయిన్ హీరో అయినప్పటికీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ అతిథి పాత్ర పోషిస్తున్నారు. అలాగే మన అక్కినేని నాగార్జున కీలకమైన రోల్ లో కనిపిస్తారు. కన్నడ అగ్ర హీరోల్లో ఒకరైన ఉపేంద్రకి మరో ప్రధానమైన రోల్ ఉంది. మలయాళ నటుడు సౌబిన్ కూడా నటిస్తున్నారు. శృతి హాసన్ రజినీకాంత్ కూతురిగా నటిస్తుండగా, పూజ హెగ్డే ఐటెం సాంగ్ చేసింది. ఇంత భారీ తారాగణం ఉన్నా కేవలం 9 నెలల్లో షూటింగ్ ని పూర్తి చేశాడు లోకేష్.
పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావొస్తున్న టైంలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారు. లోకేష్ ఇప్పటికే “ఖైదీ”, “మాస్టర్”, “విక్రమ్” వంటి హిట్ సినిమాలు తీశాడు. అందుకే, ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.