
రవితేజ, దర్శకుడు పూరి జగన్నాథ్ మధ్య ఇప్పుడు మునుపటి “ఫ్రెండ్షిప్” లేదు. మరీ ముఖ్యంగా ఇటీవల వీరి మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. దానికి తోడు అగ్గిలో ఆజ్యం పోసినట్లు, రవితేజ కొత్త సినిమా “మిస్టర్ బచ్చన్” పూరి తీస్తున్న “డబుల్ ఇస్మార్ట్”కి పోటీగా విడుదల అవుతోంది. ఉన్నట్టుండి రవితేజ “మిస్టర్ బచ్చన్” సినిమాని తన సినిమాకి పోటీగా నిలపడం పూరికి కోపం తెప్పించింది.
ఆదివారం (ఆగస్టు 4) నాడు “డబుల్ ఇస్మార్ట్” ట్రైలర్ ని విశాఖపట్నంలో విడుదల చేశారు. అక్కడ జరిగిన ఈవెంట్ లో పూరి జగన్నాథ్ కెరీర్ పై ఒక వీడియోని ప్రదర్శించారు. ఐతే, ఆ వీడియోలో రవితేజకు సంబంధించిన విజువల్ కూడా లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ పడ్డాయి. ముఖ్యంగా రవితేజ ఫ్యాన్స్ ఈ విషయాన్ని చెప్తున్నారు.
రవితేజతో పూరి నాలుగు సినిమాలు తీశారు. “ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం”, “ఇడియట్”, “అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి”, “దేవుడు చేసిన మనుషులు”. రవితేజ హీరోగా నిలబడింది పూరి సినిమాల వల్లే. కానీ ఇప్పుడు వారి మధ్య గ్యాప్ అలా పెరిగింది.
“డబుల్ ఇస్మార్ట్”తో రవితేజ “మిస్టర్ బచ్చన్” పోటీ పడుతుండడం కారణంగానే పూరి ఇలా రవితేజ విజువల్ ని కనిపించకుండా చేశారని అంటున్నారు.