
మరకతమని కీరవాణికి ఆస్కార్ అవార్డు దక్కింది. ఆస్కార్ అందుకున్న మొదటి తెలుగు వాడు కీరవాణి. అరుదైన ఘనత ఇది. “ఆర్ ఆర్ ఆర్” సినిమా కోసం స్వరపరిచిన “నాటు నాటు” అనే పాటకు ఆస్కార్ జ్యూరీ ఉత్తమ పాటగా అవార్డు ప్రదానం చేసింది.
ఐతే, కీరవాణి మాత్రం ఇది గొప్ప పాట కాదు అనే భావనతోనే ఉన్నారు. “నేను స్వరపరిచిన వాటిలో కూడా ఇది బెస్ట్ కాదు. జనాలకు ఆ టైంలో నచ్చింది. వైరల్ అయింది. కానీ ఇది గొప్ప పాట, బెస్ట్ కంపొజిషన్ అని మాత్రం అని అనను,” అని తాజాగా కీరవాణి పేర్కొన్నారు.
నిజమే కీరవాణి తన కేరీర్ లో ఎన్నెన్నో గొప్ప పాటలు చేశారు. వాటికి ఆస్కార్ రాలేదు. ఆ మాటకొస్తే ఇళయరాజా వంటి గొప్ప సంగీత దర్శకులు ఎన్నో గొప్ప పాటలు స్వరపరిచారు కానీ వాటికి ఆ అదృష్టం దక్కలేదు.
ఆస్కార్ అవార్డు అంటే అంతే. ఆ ఏడాది విడుదలైన వాటిలో ఆస్కార్ పరిశీలనకు వచ్చిన వాటినే పరిగణనలోకి తీసుకుంటారు. “ఆర్ ఆర్ ఆర్” టీం చేసిన సోషల్ మీడియా ప్రచారం, హంగామా కారణంగా ఆస్కార్ జ్యురి వరకు ఈ సినిమా వెళ్ళింది. అక్కడి వాళ్లకు సినిమా కన్నా ఈ పాట నచ్చింది. దాంతో, అవార్డు ఇచ్చారు.