
రాజ్ తరుణ్ బయటకు రావొచ్చు. చక్కగా తన పనులు తాను చేసుకోవచ్చు. ధైర్యంగా మీడియాను ఎదుర్కోవచ్చు. ఎందుకంటే, అతడిపై ఉన్న అతిపెద్ద మచ్చ చెరిగిపోయింది. ఎవరైతే రాజ్ తరుణ్ పై ఇన్నాళ్లూ విమర్శలు చేశారో, కేసులు పెట్టారో.. స్వయంగా ఆ అమ్మాయే రాజ్ తరుణ్ కు క్షమాపణలు చెప్పింది.
రాజ్ తరుణ్ తన భర్త అంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన లావణ్య, ఆ వివాదాన్ని దాదాపు 2 నెలల పాటు కొనసాగించింది. తాజాగా ఉన్నట్టుండి రూటు మార్చింది. రాజ్ తరుణ్ మంచోడంటూ మీడియా ముందు ప్రకటించింది. అతడికి క్షమాపణలు కూడా చెప్పింది. రేపోమాపో రాజ్ తరుణ్ పై పెట్టిన కేసును విత్ డ్రా చేసుకుంటానంటోంది లావణ్య.
అయితే ఇక్కడే లీగల్ గా చాలా చిక్కులున్నాయి. కేసు పెట్టడం వరకే మన వంతు. ఉన్నఫలంగా వాపస్ తీసుకుంటామంటే అన్ని కేసుల్లో అది సాధ్యం కాదంటున్నారు లీగల్ విషయాలు తెలిసిన నిపుణులు.
కొన్ని కేసులు పెట్టినంత ఈజీగా ఉపసంహరించుకోవడం సాధ్యం కాదని, రాజ్ తరుణ్ పై లావణ్య పెట్టిన కేసు కూడా అలాంటిదేనని అంటున్నారు. ఉన్నఫలంగా కేసు వెనక్కు తీసుకోవాలని లావణ్య భావించినప్పటికీ, విషయం కోర్టు వరకు వెళ్లింది కాబట్టి, అది అంతిమంగా పోలీసులకు ఇబ్బందిగా మారుతుందని చెబుతున్నారు. సో.. ప్రస్తుతానికైతే రాజ్ తరుణ్ కు స్వల్ప ఊరట మాత్రమే దక్కిందనుకోవాలి.