
ప్రస్తుతం కన్నడనాట లీడర్స్ వెర్సెస్ యాక్టర్స్ యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. బెంగళూరులో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు ఆహ్వానిస్తే స్టార్స్ ఎవ్వరూ రాలేదని కోపం కర్నాటక ప్రభుత్వంలో కనిపిస్తోంది. స్టార్ హీరో సుదీప్ నుంచి హీరోయిన్ రష్మిక వరకు చాలామంది ఈ వేడుకకు హాజరుకాలేదు.
దీనికి సంబంధించి రష్మికపై కన్నడనాట ఇప్పటికీ ట్రోలింగ్ నడుస్తోంది. స్వయంగా ఎమ్మెల్యే, మీడియా ముందుకొచ్చి చాలా కామెంట్స్ చేశాడు. రష్మికకు గుణపాఠం చెప్పాల్సిన టైమ్ వచ్చిందన్నాడు.
అటు ఉప ముఖ్యమంత్రి శివకుమార్ కూడా తారలందరిపై పరోక్షంగా స్పందించారు. సినీజనాలకు నట్టులు, బోల్టులు బిగించాల్సిన టైమ్ వచ్చిందన్నారు. సినీ రంగంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వంతో పని ఉంటుందని, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలని పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు.
ఓవైపు ఈ రచ్చ నడుస్తుండగానే, సినీ రంగంపై సైలెంట్ గా బాంబ్ పేల్చింది కర్నాటక సర్కారు. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్సులు అనే తేడా లేకుండా అన్ని థియేటర్లలో, అన్ని షోలకు ఫ్లాట్ 200 రూపాయల టికెట్ రేటు పరిమితిని విధించింది. అంటే 200 రూపాయలకు మించి టికెట్ అమ్మొద్దు.
సినిమా రంగాన్ని ప్రోత్సహించడం కోసమే ఈ పని చేసినట్టు ప్రభుత్వం చెప్పుకొచ్చింది. అటు ఇండస్ట్రీ వర్గాలు మాత్రం దీని వల్ల సినిమా మార్కెట్ పూర్తిగా దెబ్బతింటుందని చెబుతున్నారు. ఇప్పుడిప్పుడు కన్నడ నుంచి పాన్ ఇండియా సినిమాలొస్తున్నాయని, ఇలాంటి టైమ్ లో టికెట్ రేట్లు తగ్గించేస్తే, భారీ బడ్జెట్ సినిమాలు రావని చెబుతున్నారు. సౌత్ సిటీస్ లో టికెట్ రేట్లు బెంగళూరులోనే ఎక్కువ.