కంగనా రనౌత్ నటించి, దర్శకత్వం వహించిన “ఎమెర్జెన్సీ” చిత్రం ఎట్టకేలకు వెలుగు చూడనుంది. ఇందిరాగాంధీ విధించిన “ఎమెర్జెన్సీ” కాలంపై కంగనా సంధిస్తున్న రాజకీయ బాణం ఇది. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఈ బీజేపీ ఎంపీ తీసిన సినిమాకి సాధారణంగా ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. కేంద్రంలో ఉన్నది బీజేపీనే. ఈ సినిమాకి కేంద్ర ప్రభుత్వం ఎర్ర తివాచీ వెయ్యాలి. కానీ అలా జరగలేదు.
ఎందుకో, ఈ సినిమాకి సెన్సార్ అభ్యంతరాలు వచ్చాయి. అనేక సన్నివేశాలను తొలగించాలి, లేదా మార్పులు చెయ్యాలని అని సెన్సార్ బోర్డు పట్టుపట్టింది. దాంతో, కంగనా తన సినిమాని వాయిదా వేసింది. నాలుగు నెలల పాటు “కరెక్షన్లు” చేసింది కంగనా. ఇక ఇప్పుడు ఈ సినిమాకి విడుదల తేదీ దక్కింది.
రిపబ్లిక్ డేని టార్గెట్ చేస్తూ కంగనా ఈ సినిమాకి జనవరి 17, 2025ని విడుదల తేదీగా ఖరారు చేసింది.
కంగనా డైరెక్ట్ చేసిన రెండో చిత్రం ఇది. ఇంతకుముందు “మణికర్ణిక” సినిమా తీసింది.