పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ప్రభుత్వ కార్యకలాపాలతో తలమునకలై ఉన్నారు. ఆయన పూర్తి చెయ్యాల్సిన మూడు సినిమాల గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇక ఆయన సినిమాలో నటించకపోవచ్చు అనేది ఒక మాట.
ఐతే, అదంతా అబద్దం అని అంటున్నారు ప్రముఖ నిర్మాత ఏ. ఎం. రత్నం. పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన “హరి హర వీర మల్లు – పార్ట్ 1” నిర్మిస్తున్నారు. ఈ సినిమా దాదాపు 80 శాతం పూర్తి అయింది. పవన్ కళ్యాణ్ ఒక పాతిక రోజుల టైం ఇస్తే మిగతా భాగం పూర్తి చేస్తామని రత్నం చెప్తున్నారు.
ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ సంస్థకు రత్నం ఇప్పటికే అమ్మేశారు. విడుదల విషయంలో ఓటిటి కంపెనీలు పక్కాగా ఉంటాయి. ఫలానా టైంలోపే సినిమాని థియేటర్లలో విడుదల చేసి, నెల తర్వాత స్ట్రీమింగ్ కి ఇవ్వాలని ఒప్పందం చేసుకుంటాయి. “హరి హర వీరమల్లు” సినిమాని ఈ ఏడాది అక్టోబర్లో విడుదల చేస్తామని అమెజాన్ సంస్థకు మాటిచ్చారు రత్నం. కానీ అది ఇప్పుడు సాధ్యం కాదు.
“అవును విడుదల కొంత ఆలస్యం అవుతుంది. కానీ ఈ ఏడాది డిసెంబర్ లోపే రిలీజ్ చేస్తాం. ఇంకా ఎక్కువ కాలం వాయిదా వెయ్యలేం,” అని ఆయన అంటున్నారు.
” హరి హర వీర మల్లు” దాదాపు మూడున్నర ఏళ్ల క్రితం మొదలు పెట్టారు. ఈ సినిమాకి మొదట దర్శకుడు క్రిష్. ఇప్పుడు అతను తప్పుకున్నాడు. దాంతో జ్యోతికృష్ణ దర్శకత్వంలో పూర్తి చెయ్యనున్నారు. కీరవాణి ఈ సినిమాకి సంగీత దర్శకుడు.