ఇటీవల పలువురు కమెడియన్లు, టీవీ నటులు పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం వాళ్ళు ప్రచార యాత్ర చేశారు. అందులో గెటప్ శ్రీను ఒకరు.
ప్రస్తుతం “రాజు యాదవ్” అనే సినిమా ప్రచారంలో పాల్గొంటున్న గెటప్ శ్రీనుకి జనసేన ప్రచారం గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ముఖ్యంగా అధికార వైసీపీ నేతలు చేస్తున్న కామెంట్స్ పై స్పందన ఏంటి అనే విషయంలో గెటప్ శ్రీను రియాక్ట్ అయ్యాడు.
పవన్ కళ్యాణ్ చిన్న చిన్న ఆర్టిస్టులకు డబ్బులు ఇచ్చి ప్రచారం చేయించుకుంటున్నాడు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
“నేను కానీ ఇతర నటులు కానీ మేం డబ్బు తీసుకోలేదు. మేం స్వచ్చంధంగా ప్రచారం చేశాం. పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానం, జనసేన పార్టీ గెలవాలి అనే ఉద్దేశంతోనే మా ప్రచారం చేశాం. డబ్బుల కోసం ప్రచారం చేశాం అనడం తప్పు,” అని గెటప్ శ్రీను అన్నాడు.
అంతే కాదు, తమని చిన్న నటులుగా జమకట్టేవాళ్లని కూడా ఛోటా లీడర్స్ అనే పిలవాల్సి ఉంటుంది అని ఘాటుగా స్పందించాడు. ఇండస్ట్రీలో ఎవరికైనా సాయం చెయ్యడంలో మెగా ఫ్యామిలీ ముందు ఉంటుంది అని శీను చెప్పాడు. పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని, అలాగే కూటమి అధికారంలోకి వస్తుంది అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు.