
“కల్కి 2898 AD” సినిమా తనకు నచ్చలేదంటూ బాలీవుడ్ నటుడు అర్షాద్ వార్శి చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా చల్లారలేదు. ఆ సినిమాలో ప్రభాస్ పాత్ర జోకర్ లా కనిపించింది అని అర్షాద్ అనడం ప్రభాస్ అభిమానులకే కాదు మిగతా ఎవరికీ నచ్చలేదు. ఐతే, అర్షాద్ కి వ్యతిరేకంగా అభిమానులు కామెంట్స్ పెట్టడం, పోస్టులు చెయ్యడం, అతను క్షమాపణ చెప్పాలని డిమాండ్ చెయ్యడం వంటివి అర్థం చేసుకోవచ్చు.
అభిమానులు అలా చెయ్యడమే కరెక్ట్. కానీ, తెలుగు సినిమా హీరోలు, ఇతర సెలెబ్రిటీలు వరుస పెట్టి అర్షాద్ కి వ్యతిరేకంగా ట్వీట్లు పెట్టడం, మాట్లాడడం వంటివి మరీ అతిగా అనిపిస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా “మా” అధ్యక్షుడు మంచు విష్ణు ఈ విషయంలో బాలీవుడ్ కి చెందిన సినిమా, టెలివిజన్ రంగాలకు సంబంధించిన నటీనటుల సంఘానికి లేఖ రాశాడు. అర్షాద్ వార్శి భవిష్యత్ లో మళ్ళీ ఇలా ప్రవర్తించకుండా చూడాలి అని ఆ లేఖలో పేర్కొన్నాడు.
ఇదంతా చూస్తుంటే తెలుగు సినిమా పరిశ్రమ మరీ అతిగా స్పందిస్తుందేమో అనే భావన మొదలైంది. అర్షాద్ తన భావాలను హుందాగా చెప్పలేదనేది వాస్తవమే. కానీ, ప్రభాస్ ని తిట్టడం వల్లే అతనికి గుర్తింపు వచ్చిందంటూ నాని వంటి హీరోలు మాట్లాడడం, మళ్ళీ ఆ తర్వాత ముంబైకి వెళ్ళగానే నాని మాట మార్చి నేను అర్షాద్ ని అలా అని ఉండాల్సింది కాదు అనడం చూస్తుంటే… మనవాళ్ళు చేస్తున్న తప్పు కూస్తో అర్థమవుతోంది.
రేపు నిజంగా అర్షాద్ తన అలా అన్నందుకు క్షమించండి అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా దీన్ని “బలవంతపు వ్యవహారం”లా చూస్తారు.
ప్రభాస్ పాత్ర ఆ సినిమాలో జోకర్ లా కనిపించింది అని అన్నాడు నటుడు తప్ప ప్రభాస్ ని జోకర్ అనలేదు. అతను కొంచెం అతిగా మాట్లాడితే మనవాళ్ళు ఇంకా అతి చేస్తున్నారు. ఒక బాలీవుడ్ నటుడు కామెంట్ కి ఇమేజ్, పాపులారిటీ పడిపోయేంత స్థాయి ప్రభాస్ ది కాదు. ఇండియాలో ప్రభాస్ చాలా పెద్ద హీరో.