
నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి తీస్తోన్న భారీ చిత్రం “అఖండ 2: తాండవం” ఇంతకుముందే విడుదల తేదీ ప్రకటించింది. సెప్టెంబర్ 25, 2025న విడుదల అని నిర్మాతలు ఇంతకుముందు చెప్పారు. ఐతే, షూటింగ్ ఆలస్యం కావడం, గ్రాఫిక్స్ టైంకి వస్తాయన్న నమ్మకం లేకపోవడంతో నిర్మాతలు ఈ సినిమాని సంక్రాంతి బరిలో నిలిపే ఆలోచన చేస్తున్నారని తెలుగుసినిమా.కామ్ ఇంతకుముందే తెలిపింది.
ఇప్పుడు అదే నిజమయ్యేలా ఉంది. ఎందుకంటే సడెన్ గా పవన్ కళ్యాణ్ చిత్రం “ఓజి డేట్ ని ప్రకటించారు. అంటే ఆ డేట్ కి లాక్ అయింది. అదే “అఖండ 2” స్థానంలో “ఓజి” రానుంది. సెప్టెంబర్ 25న “ఓజి” మంటలు రేపుతుంది అంటూ నిర్మాత దానయ్య డేట్ ప్రకటించారు.
సో, బాలయ్య చిత్రం సంక్రాంతికి కానీ, డిసెంబర్ లో కానీ విడుదల కావచ్చు. ఇక అదే డేట్ కి రావాల్సిన పవన్ కళ్యాణ్ మేనల్లుడు చిత్రం “సంబరాల ఏటి గట్టు” మరో డేట్ చూసుకోవాలిసిందే.
ఐతే, ఇదంతా పవన్ కళ్యాణ్ సినిమా చెప్పిన ఆ డేట్ కి వస్తేనే అలా అవుతుంది. “ఓజి” అనే కాదు ఏ సినిమాని త్వరగా పూర్తి చెయ్యడు పవన్ కళ్యాణ్. ఆయన స్వయంగా ఓడిపోయి, ఆయన పార్టీకి ఒక్క సీటు వచ్చినప్పుడే ఆయన సినిమా షూటింగ్ లకి ఒక ప్లానింగ్ లేకుండా వెళ్ళేవాడు. ఇక ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి. సో… ఆయన టైంకి ఈ సినిమా పూర్తి చేస్తాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతానికి ఐతే, “ఓజి”… అఖండ 2 డేట్ ని లాగేసుకుంది.