వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో రూపొందిన మూడో చిత్రం… “సంక్రాంతికి వస్తున్నాం”. జనవరి 14న విడుదల కానున్న వెంకటేష్ కి భార్యగా నటించింది ఐశ్వర్య రాజేష్. ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ తన కెరియర్లో చెయ్యలేదు అంటోంది ఈ భామ.
వెంకటేష్ సరసన అవకాశం ఎలా వచ్చింది?
నేను తమిళ్ లో “సుడల్” అనే వెబ్ సిరిస్ చేస్తున్నప్పుడు అనిల్ రావిపూడి గారు ఈ ఆఫర్ ఇచ్చారు. అతను కథ చెప్తున్నప్పుడే పడిపడి నవ్వుకున్నాను. నా కెరీర్ లో ఇంత ఎంజాయ్ చేసి విన్న స్క్రిప్ట్ ఇదే. భాగ్యం అనే పాత్ర ఇచ్చారు నాకు. అలాంటి పాత్ర ఇంతవరకు నేను చెయ్యలేదు. అందుకే వెంటనే ఒప్పుకున్నాను. నేను తెలుగులో ఇంతవరకు నటించిన సినిమాల్లో మంచి పాట నాకు దక్కలేదు. ఇందులో “గోదారి గట్టు” పాట పడింది. అది బాగా రీచ్ అయింది. వెంకటేష్ లాంటి పెద్ద హీరోతో ఇంత అద్భుతమైన సాంగ్ చేయడం అదృష్టం.
వెంకటేష్ గారితో నటించడం ఎలా ఉంది?
మొదట్లో చాలా భయం వేసింది. నాకు ఇచ్చిన భాగ్యం పాత్ర కత్తిమీద సాములాంటిది. కాస్త శ్రుతిమించిన ఓవర్ డోస్ అయిపోతుంది. భాగ్యం పాత్రని అర్ధం చేసుకోవడానికి నాకు పదిరోజులు పట్టింది. వెంకీ గారు అతి చెయ్యరు. నేచురల్ గా ఎమోషన్స్ పండిస్తారు. ఆయన టైమింగ్ అద్భుతం. ఆయనతో కలసి యాక్ట్ చేయడం మామూలు విషయం కాదు. అయితే ఆయన చాలా ఎంకరేజ్ చేసేవారు. ఆయన చాలా పాజిటివ్ గా ఉంటారు.
ఈ సినిమా కామెడీనా? ఫ్యామిలీ డ్రామానా?
ఇది ఫీల్ గుడ్ ఫ్యామిలీ చిత్రం. ఆద్యంతం నవ్వుతూనే ఉంటారు. నాది చాలా ఫ్రెష్ రోల్. అందరికీ నచ్చే చిత్రం. అనిల్ ఈ కథని కొత్తగా చెప్పారు.
మరో హీరోయిన్ (మీనాక్షి చౌదరి)తో కలిసి నటించారు కదా!
మీనాక్షి కష్టపడి పైకి వచ్చింది. మంచి అమ్మాయి. తనతో మంచి స్నేహం ఏర్పడింది. తను, నాతో పాటు సినిమా అంతా ఉంటుంది. మరో హీరోయిన్ తో కలిసి నటించడం నాకు అభ్యంతరం లేదు. మా ఇద్దరివీ మెయిన్ రోల్స్.
ఎలాంటి కథలు, పాత్రలు ఇష్టం?
నా వరకూ డిఫరెంట్ రోల్స్ చేయడానికి ఇష్టపడతాను. ఏ పాత్ర ఇచ్చినా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. కొంచెం సామజిక బాధ్యత కలిగిన పాత్రలంటే ఇష్టం.