తెలుగు సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు పెద్దగా స్కోప్ ఉండదు. అందరూ అంగీకరించాల్సిన వాస్తవం ఇది. ఎందుకంటే, కథలన్నీ ఎక్కువగా హీరోల చుట్టూనే తిరుగుతుంటాయి. కాబట్టి హీరోయిన్లకు నటించడం చాలా ఈజీ అనుకుంటారంతా.
కానీ కొంతమంది హీరోల సరసన నటించడం కత్తిమీద సాములాంటి వ్యవహారం. ఇంకా చెప్పాలంటే హీరోయిన్లకు చుక్కలు కనిపిస్తాయి.
ఉదాహరణకు సిద్ధు జొన్నలగడ్డనే తీసుకుంటే.. ఇతడితో నటించడానికి అనుపమ పరమేశ్వరన్ చాలా ఇబ్బంది పడింది.
‘టిల్లూ స్క్వేర్’లో సిద్ధు-అనుపమ కలిసి నటించారు. ఒక దశలో అనుపమ పెర్ఫార్మెన్స్ పై సిద్ధు అసంతృప్తి వ్యక్తం చేశాడు. దీంతో ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకున్నట్టు కథనాలు కూడా వచ్చాయి. మళ్లీ ఎలాగోలా నచ్చజెప్పి ప్రాజెక్టులోకి తీసుకొచ్చారు. అప్పట్లో ఈ వివాదం గురించి అందరికీ తెలిసిందే.
అడివి శేష్ తో కూడా వ్యవహారం ఇలానే ఉంటుందనే విషయం తాజాగా బయటపడింది. ‘డెకాయిట్’ నుంచి శృతిహాసన్ ఏకంగా బయటకొచ్చేసింది. సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలో అడివి పూర్తిగా ఇన్వాల్వ్ అవుతాడు. క్వాలిటీ కోసం తపిస్తాడు. ఈ విషయంలోనే శృతికి, అడివి శేష్ కి అభిప్రాయ భేదాలు వచ్చాయని అంటారు.
ఇక విశ్వక్ సేన్ సంగతి తాజాగా బయటపడింది. ఈ హీరో కూడా తన సినిమాల్లో హీరోయిన్ల విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉంటాడు. ఏమాత్రం తేడా అనిపించినా దర్శకుడి కంటే ముందు తనే రీటేక్ అని చెబుతాడంట. ఈ విషయాన్ని శ్రద్ధా శ్రీనాధ్ బయటపెట్టింది. విశ్వక్ తో కొన్ని సీన్స్ చేయడం టఫ్ అనిపించిందని వెల్లడించింది.