ప్రతి హీరోకి ఒక మార్కెట్ ఉంటుంది. ఒక్కోసారి ఆ హీరోల స్థాయిని మించి ఖర్చు పెడుతుంటారు నిర్మాతలు, దర్శకులు. దానికి కారణం కథ మీద ఉన్న నమ్మకం. “బాహుబలి” విషయంలో అదే జరిగింది. అది చరిత్ర సృష్టించింది. ఇటీవల “హనుమాన్” విషయంలో కూడా అంతే అయింది. తేజ సజ్జా హీరోగా నిలబడ్డాడు.
తేజ సజ్జా విజయంతో ఇపుడు కిరణ్ అబ్బవరం కూడా అదే రూట్ లో వెళ్తున్నాడు. “కా” పేరుతో మొదటి సారి పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ముగిసింది. ఇటీవలే టీజర్ కూడా వచ్చింది. కిరణ్ అబ్బవరం మార్కెట్ ఎంత అనేది ఏ నిర్మాతకు తెలియదు. ఎందుకంటే ఆయన నటించిన గత చిత్రాలు అన్ని పరాజయం పాలయ్యాయి. మొదటి రెండు, మూడు సినిమాలు మినహా మిగతావన్నీ నిర్మాతలకు నష్టాలే మిగిల్చాయి.
మరి అలాంటి హీరోతో భారీ ఖర్చుతో పాన్ ఇండియా లెవల్లో సినిమా ఎందుకు తీస్తున్నారు? “కథే పాన్ ఇండియాని డిసైడ్ చేస్తుంది. హీరో, హీరో మార్కెట్ కాదు,” అని కిరణ్ అబ్బవరం అంటున్నాడు. మరి అతని నమ్మకం ఫలిస్తుందా?
సాయిధరమ్ తేజ్ కూడా 120, 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఒక సినిమా (#SDT18) చేస్తున్నాడు. అది కూడా కొత్త దర్శకుడు తీస్తున్న సినిమా కావడం విశేషం. “హనుమాన్” నిర్మాతలు నిర్మిస్తోన్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది. పూర్తి అయ్యేసరికి 200 కోట్లు ఖర్చు అయినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు అని నిర్మాతలే చెప్తున్నారు.
మరి సాయి ధరమ్ తేజ్ కి అంత మార్కెట్ ఉందా? “విరూపాక్ష” మినహా మిగతా ఏ సినిమా కూడా వంద కోట్ల మార్క్ అందుకోలేదు. పాన్ ఇండియా క్రేజ్ తో తీస్తున్నారు. మరి సాయి ధరమ్ తేజ్ కి ఈ సినిమా పాన్ ఇండియా మార్కెట్ తెస్తుందా?
ఇక తేజ సజ్జా గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. “హనుమాన్” సక్సెస్ తర్వాత ఈ కుర్ర హీరో ఒప్పుకున్న సినిమాలన్నీ పాన్ ఇండియా చిత్రాలే.
ప్రస్తుతం “మిరాయి” అనే సినిమా చేస్తున్నాడు. ఇది కూడా భారీ బడ్జెట్ చిత్రమే. ఈ సినిమాకి దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని. ఇతను ఇంతకుముందు డైరెక్ట్ చేసిన “సూర్య వర్సెస్ సూర్య”, “ఈగిల్” చిత్రాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా ఈయన డైరెక్షన్ ని నమ్మి నిర్మాతలు తేజ సజ్జాతో కోట్ల రూపాయలను ఇన్వెస్ట్ చేస్తున్నారు.