
ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన “స్పిరిట్” చిత్రం ఇంతవరకు పట్టాలెక్కలేదు. దానికి కారణం ప్రభాస్ మోకాళ్ళ నొప్పులు, “రాజాసాబ్” సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడం. ఈ ఏడాది అక్టోబర్ నుంచి మొదలుపెడుదాం అని ప్రభాస్ చెప్పడంతో సందీప్ రెడ్డి వంగా ఆ సినిమాని పక్కన పడేసి రణబీర్ కపూర్ తో “యానిమల్ పార్క్” సినిమా స్టార్ట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.
దాంతో, ఈ పుకార్లపై నిర్మాత భూషణ్ కుమార్ స్పందించారు. టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అటు ‘స్పిరిట్’, ఇటు ‘యానిమల్’ సిరీస్ కి నిర్మాత. సందీప్ వంగాతో ఐదు చిత్రాలకు భూషణ్ కుమార్ ఒప్పందం చేసుకున్నారు.
“స్పిరిట్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యాకే యానిమల్ పార్క్ మొదలవుతుంది. ఇప్పటివరకు ఈ ప్లాన్ లో మార్పు లేదు. ప్రభాస్ సినిమా కాస్త ఆలస్యం అవుతోంది. కానీ దాన్ని పక్కన పెట్టలేదు. ఈ ఏడాదే స్పిరిట్ స్టార్ట్ అవుతుంది,” అని భూషణ్ కుమార్ మీడియాకి తెలిపారు.
సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ కి డిమాండ్లు పెట్టారు. తన సినిమా కోసం పూర్తిగా డేడికేట్ కావాలి. ఫైట్ సీన్స్ మినహా అన్ని సన్నివేశాల్లో మీరే నటించాలి, డూప్ ని ఒప్పుకోను అని వంగా కండీషన్లు పెట్టారు. అందుకే, ప్రభాస్ మిగతా సినిమాలలాగ వెంటనే దీన్ని స్టార్ట్ చెయ్యలేకపోయాడు.
రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ నటించింది తక్కువ. ఆయన డూప్స్ చేసిన సీన్లు ఎక్కువ అని రూమర్స్ ఉన్నాయి. అందుకే, వంగా ఈ కండీషన్లు పెట్టినట్లు తెలుస్తోంది.