మహానటుడిగా పేరొందిన బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ కోసం తెలుగు మేకర్స్ ప్రత్యేక పాత్రలు సృష్టిస్తున్నారు. ఆయనకు తెలుగు భాష రాదు కానీ ఆయన ఇప్పటికే మూడు తెలుగు సినిమాల్లో నటించారు. తాజాగా మరో చిత్రంలో ఆయనని నటింపచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అమితాబ్ వయస్సు ఇప్పుడు 81 ఏళ్ళు. ఆయనకి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. అయినా ఆయన సినిమాలు చేస్తూనే ఉన్నారు. అందుకే తాజాగా రామ్ చరణ్ కొత్త సినిమాలో తాత పాత్ర కోసం అమితాబ్ ని సంప్రదించారట. దర్శకుడు బుచ్చిబాబు తీస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ హీరో, జాన్వీ కపూర్ హీరోయిన్. విలన్ గా సంజయ్ దత్ నటించనున్నారు. ఒక కీలక పాత్రలో కన్నడ నటుడు శివరాజ్ కుమార్ నటిస్తున్నారు.
ఇక ఇప్పుడు అమితాబ్ ని రామ్ చరణ్ తాత పాత్ర కోసం అడుగుతున్నారట. ఆయన ఇంకా ఓకె చెప్పలేదు.
ఇప్పటికే తెలుగులో ‘సైరా’ సినిమాలో గురువు పాత్ర పోషించారు అమితాబ్. అలాగే, ‘మనం’ సినిమాలో ఒక రెండు నిమిషాల పాటు కన్పిస్తారు. ప్రభాస్ హీరోగా నాగ అశ్విన్ తీస్తున్న “కల్కి 2898 AD” చిత్రంలో అమితాబ్ ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.
అమితాబ్ బచ్చన్ ని తీసుకోవడానికి కారణం కూడా పాన్ ఇండియన్ మార్కెట్ కోసమే.