
ఎప్పుడైతే ‘భారతీయుడు-2’ సినిమా డిజాస్టర్ అయిందో అప్పట్నుంచి దర్శకుడు శంకర్ పై కథనాలు వస్తూనే ఉన్నాయి. దీనికితోడు కాపీరైట్ వివాదంతో కూడా ఈ దర్శకుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. మధ్యలో ‘గేమ్ ఛేంజర్’ ఉండనే ఉంది.
ఇవి చాలవన్నట్టు అతడి మెడకి ‘భారతీయుడు-3’ కూడా బిగుసుకొని ఉంది. ఆ సినిమాను కూడా అతడు పూర్తిచేయాలి. దాదాపు జీరో బడ్జెట్ లో దాన్ని ముగించాల్సి ఉంది. అటు బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ దర్శకత్వంలో శంకర్ చేయాల్సిన సినిమా కూడా దాదాపు ఆగిపోయింది.
ఇలా వరుసగా ఇబ్బందులు పడుతున్న శంకర్, ఇప్పుడు ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడనే ప్రచారం సాగుతోంది. త్వరలోనే అతడు దర్శకత్వానికి గ్యాప్ ఇస్తాడట. ‘భారతీయుడు-3’ పనులు ముగిసిన వెంటనే అతడు రెండేళ్లు విరామం తీసుకుంటాడట.
ఈ ప్రచారంలో నిజం ఎంతో తెలియదు కానీ సోషల్ మీడియా మాత్రం అది సరైన నిర్ణయం అంటూ కామెంట్స్ చేస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో శంకర్ కాస్త విరామం తీసుకోవడమే కరెక్ట్ అంటున్నారు నెటిజన్లు.