
‘సిటాడెల్-హనీబన్నీ’ తర్వాత సమంత సినిమాల వైపు వస్తుందని ఆమె ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూశారు. ఆ సిరీస్ ప్రమోషన్ టైమ్ లో సమంత కొత్త సినిమా ప్రకటిస్తుందని చూశారు. అయితే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ, సమంత మరో వెబ్ సిరీస్ కు కమిట్ అయింది. ప్రస్తుతం ఆమె ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే సిరీస్ చేస్తోంది.
చాన్నాళ్ల కిందటే ముంబయికి షిఫ్ట్ అయిన సమంత, ఇప్పటికీ అక్కడే కొనసాగుతోంది. అడపాదడపా మధ్యమధ్యలో హైదరాబాద్ వచ్చి వెళ్తోంది. ఈ క్రమంలో ఆమె ఇక తెలుగు సినిమాలు చేయకపోవచ్చనే చర్చ మొదలైంది.
గతంలో ఆమె ఓ సినిమా ప్రకటించింది. దాని కోసం సొంతంగా నిర్మాణ సంస్థను కూడా స్థాపించినట్టు ప్రకటించింది. ఈ ప్రకటనలన్నీ వచ్చి చాన్నాళ్లయినా ఇప్పటివరకు ఆమె తన ప్రొడక్షన్ హౌజ్ గురించి లేదా కొత్త సినిమా గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆమె సినీ కెరీర్ పై అనుమానాలు పెరగడానికి ఇది కూడా ఓ కారణం.
సౌత్ లో తను ఎలాంటి పాత్రలు పోషించాలనుకుంటున్నాననే అంశంపై ఈమధ్య స్పందించింది సమంత.

37 ఏళ్ల ఈ వయసులో తను చేయబోయే ప్రతి సినిమాను చివరి చిత్రంగా భావిస్తున్నానని, వందశాతం నమ్మకం లేకపోతే సినిమాలు అంగీకరించడం లేదని తెలిపింది.
ఆమె కెరీర్ పై అనుమానాలు పెరగడానికి ఈ స్టేట్ మెంట్ కూడా ఓ కారణంగా చెబుతారు చాలామంది. ఏదేమైనప్పటికీ సమంత మాత్రం ఇప్పటివరకు కొత్త సినిమా ప్రకటించలేదు. తెలుగులో చివరిగా ఆమె ‘ఖుషి’ సినిమా చేసింది.