39 ఏళ్ల వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి చేసుకొంది. 14 ఏళ్లుగా తెలిసిన నికొలాయ్ తో ఆమె వివాహం థాయ్ ల్యాండ్ లోని క్రాబి దీవిలో జరిగింది. తాజాగా ఈ అమ్మడు తన పెళ్లి ఫోటోలను షేర్ చేసింది.
తన పెళ్లి వేడుక పూర్తయిందని ప్రకటిస్తూనే, భర్తపై ప్రేమను మరోసారి చాటుకుంది.
కథల్లో చెప్పుకునేలాంటి పెళ్లి జరిగిందని వెల్లడించింది వరలక్ష్మి. తన యువరాజు పెళ్లి చేసుకోమని తనను కోరాడని, దానికి నేను ఓకే చెప్పానని రాసుకొచ్చింది. ప్రేమలు, కేరింతలు, మంచి ఆహారం.. ఇలా ఆ పెళ్లి రోజును తను ఎప్పటికీ మరిచిపోలేనని అంటోంది.
ఈ సందర్భంగా తనను వధువుగా తయారుచేసిన సిబ్బందికి థ్యాంక్స్ చెప్పింది వరు. సెలబ్రిటీ స్టయిలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్ జయలక్ష్మి సుందరేశన్.. వరలక్ష్మి పెళ్లిలో దుస్తులు, స్టయిలింగ్ బాధ్యత తీసుకుంది. ఆమె ధరించిన పెళ్లి పట్టుచీరను క్లియో సిల్క్స్ కంపెనీ తయారుచేసింది.
10వ తేదీన థాయ్ లాండ్ లోని ఓ బీచ్ రిసార్ట్ లో కొంతమంది సన్నిహితులు, బంధువుల సమక్షంలో వరలక్ష్మి శరత్ కుమార్, నికొలాయ్ ఒక్కటయ్యారు. అయితే పెళ్లికంటే ముందే ఆమె సినిమా ప్రముఖులకు 3వ తేదీన చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటుచేసింది.