ఊహించని విధంగా అఖిల్ ఎంగేజ్ మెంట్ మేటర్ తెరపైకొచ్చిన సంగతి తెలిసిందే. ఓవైపు అంతా నాగచైతన్య పెళ్లి కబుర్లతో బిజీగా ఉంటున్న టైమ్ లో, ఉరుములేని పిడుగులా నిశ్చితార్థం మేటర్ బయటపెట్టాడు అఖిల్. జైనాబ్ రౌజీని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించాడు.
అయితే అదే టైమ్ లో అతడి పెళ్లిపై సోషల్ మీడియాలో పుకార్లు చెలరేగాయి. నాగచైతన్య పెళ్లితో పాటు, అఖిల్ పెళ్లిని కూడా ఒకే రోజు, ఒకే ముహూర్తానికి జరిపించాలని నాగార్జున ఫిక్స్ అయ్యాడట. అందుకే చిన్నకొడుకు నిశ్చితార్థాన్ని కూడా చకచకా పూర్తిచేశాడట.
వైరల్ అవుతున్న ఈ పుకారులో నిజం లేదని తాజాగా నాగ్ ప్రకటించాడు. ప్రస్తుతం తమ కుటుంబం దృష్టి మొత్తం నాగచైతన్య పెళ్లిపైనే ఉందని, వచ్చే ఏడాది అఖిల్ పెళ్లి జరిపిస్తామని నాగార్జున విస్పష్టంగా ప్రకటించాడు. దీంతో అఖిల్ పెళ్లిపై 24 గంటలుగా నడిచిన ఊహాగానాలకు తెరపడింది.
హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త కూతురు జైనాబ్ రౌజీ. ఆమె స్వతహాగా పెయింటర్. ఇప్పటికే తన పెయింటింగ్స్ తో హైదరాబాద్, ముంబయి, లండన్, దుబాయ్ లో ప్రదర్శనలు కూడా ఇచ్చింది.