
సీక్వెల్స్ పై దర్శకుడు కృష్ణవంశీ ఇప్పటికే తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశారు. సీక్వెల్స్ ఎలా తీస్తారో తనకు అస్సలు అర్థం కాదంటూ స్పందించాడు. తను ఎట్టిపరిస్థితుల్లో సీక్వెల్స్ చేయనని కూడా ప్రకటించాడు. దీంతో కృష్ణవంశీకి సీక్వెల్స్ అంటే ఇష్టంలేదని అర్థమైపోయింది.
అయినప్పటికీ ఈ దర్శకుడ్ని సీక్వెల్స్ పై ప్రశ్నిస్తూనే ఉన్నారు నెటిజనం. తాజాగా “మురారి” సినిమా మరోసారి థియేటర్లలోకి వచ్చిన సందర్భంగా ఆ సినిమా సీక్వెల్ అంశం తెరపైకి వచ్చింది.
మహేష్ వీరాభిమాని ఒకరు కృష్ణవంశీని ఆసక్తికరమైన ప్రశ్న అడిగాడు. గౌతమ్ ఎలాగూ సినిమాల్లోకి వస్తాడు కాబట్టి, అతడ్ని హీరోగా పెట్టి “మురారి-2” తీయాలనేది అతడి అభ్యర్థన.
ఇదొక ఇంట్రెస్టింగ్ రిక్వెస్ట్ కావడంతో కృష్ణవంశీ, గతంలోలా వెంటనే నో చెప్పలేకపోయాడు. అది తన పరిథిలో లేని అంశమని మాత్రమే స్పందించాడు. “మురారి” సీక్వెల్ పై మహేష్, నమ్రత, గౌతమ్ కలిసి నిర్ణయం తీసుకోవాలని, అది తన చేతిలో లేదని అర్థం వచ్చేలా మాట్లాడారు.