దర్శకుడు ఆర్జీవీపై కేసు నమోదైంది. ‘వ్యూహం’ సినిమా టైమ్ లో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, నారా బ్రాహ్మణిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేశాడంటూ రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది.
ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం, మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు. ఈ మేరకు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ ఎకౌంట్ లో కొన్ని స్క్రీన్స్ షాట్స్ ను కూడా ఆయన పోలీసులకు సమర్పించారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయనకు అనుకూలంగా వ్యూహం అనే సినిమా తీశాడు వర్మ. వైఎస్ఆర్ మరణం నుంచి వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఎదిగిన వరకు జరిగిన ఘటనల నేపథ్యంలో ఆ సినిమా తీశాడు.
దీన్ని అడ్డుకునేందుకు ఒక దశలో నారా లోకేష్ హైకోర్టును ఆశ్రయించారు. సెన్సార్ సర్టిఫికేట్ రద్దు చేయాలని కోరారు. కానీ సినిమా రిలీజైంది. ఆ సినిమా విడుదల సందర్భంగా వర్మ చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు ఐటీ చట్టం కింద కేసు నమోదైంది.
అయితే ఇలాంటి కేసులు వర్మకు కొత్త కాదు. వీటి నుంచి అతడు చాలా ఈజీగా బయటకొస్తాడు. ఎందుకంటే, అతడు పెట్టే ట్వీట్స్ అలా ఉంటాయి మరి. నేరుగా వ్యక్తిని ఉద్దేశించి కామెంట్ చేయడు, కానీ ఎవరికి తగలాలో వాళ్లకు తగుల్తాయి. పైగా అతడు పెట్టే పోస్టులు కూడా డొంక తిరుగుడుగా, లీగల్ గా దొరక్కుండా ఉంటాయి.