![Siddharth](https://telugu.telugucinema.com/wp-content/uploads/2024/11/siddharth-news.jpg)
తన పెళ్లిపై స్పందించాడు హీరో సిద్దార్థ్. తన జీవితంలోకి దేవత వచ్చిందన్నాడు. గతంలో ఓ సంక్రాంతికి ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమా వచ్చిందని, అప్పుడు తను తెలంగాణ బిడ్డగా హైదరాబాద్ లో ఉన్నానని…ఈ సంక్రాంతికి తెలంగాణ అల్లుడిగా మారానని అన్నాడు.
“హ్యాపీగా ఉన్నాను.. కామ్ గా ఉన్నాను. కోపం తగ్గింది. నాకో వరం దొరికింది. నా లైఫ్ లోకి నా దేవత వచ్చింది. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఏడాది నాకు ఏదైనా మంచి విషయం జరిగిందంటే అది నా పెళ్లి మాత్రమే. ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాతో నాకు ఓ కొత్త జీవితం ఇచ్చారు. ఆ తర్వాత నేను చాలాకాలం హైదరాబాద్ లోనే ఇల్లు తీసుకొని, తెలంగాణ బిడ్డగా హైదరాబాద్ లో పెరిగాను. ఇప్పుడు తెలంగాణ అల్లుడిగా మారాను.”
ఇలా తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు సిద్దార్థ్. పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ పై స్పందించిన ఈ హీరో… ఆ కాన్సెప్ట్ గురించి చాలామందికి తెలియకముందే తను పాన్ ఇండియా హీరోగా మారానని అన్నాడు.
“పాన్ ఇండియా అనే పదం ఇప్పుడు వాడుతున్నారు. దానికంటే ముందే నేను పాన్ ఇండియా హీరోని. ఎన్నో భాషల్లో సినిమాలు చేశాను. ప్రతి భాషలో సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పుకున్నాను. 3 రకాల మీడియాలను పిలిచి ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఇవన్నీ నేనే ఫస్ట్ చేశాను.”
![Adiiti and Siddharth](https://telugu.telugucinema.com/wp-content/uploads/2024/04/aditisiddharthengagement.jpg)
“మిస్ యు” సినిమాతో మరోసారి ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు సిద్దార్థ్. అషికా రంగనాధ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఓ మంచి లవ్ స్టోరీతో తెరకెక్కిందని అంటున్నాడు.