కొన్ని సినిమాలు రిలీజ్ అయిన తర్వాత, ఫలానా సినిమాను ఆ హీరో కాకుండా, మరో స్టార్ చేస్తే బాగుంటుందనే చర్చ ఎప్పుడూ ఉంటుంది. గతంలో ఎన్నో చిత్రాల విషయంలో అలా పవన్ కల్యాణ్ పేరు వినిపించేది. ఇప్పుడు ‘జీబ్రా’ వంతు.
సత్యదేవ్ హీరోగా నటించిన చిత్రం ‘జీబ్రా’. బ్యాంకింగ్ చుట్టూ నడిచే డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య పాత్రలో నటించాడు సత్యదేవ్. దీనికి సమానంగా నడిచే మరో పాత్రలో డాలీ ధనుంజయ నటించాడు.
ఈ సినిమాలో తను కాకుండా, హీరోగా వేరే ఎవరు నటిస్తే బాగుంటుందనే ప్రశ్న సత్యదేవ్ కు ఎదురైంది. ఇలాంటి ప్రశ్నల్ని చాలామంది స్కిప్ చేస్తుంటారు. కానీ సత్యదేవ్ మాత్రం సమాధానం ఇచ్చాడు.
‘జీబ్రా’ లో తను పోషించిన పాత్రను ఇప్పుడున్న స్టార్ హీరోల్లో ప్రభాస్ నటిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు సత్య. గతంలో ఈ హీరో, ప్రభాస్ ‘మిస్టర్ పెర్ ఫెక్ట్’ సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం విడుదలైన “జీబ్రా”కి మెల్లగా కలెక్షన్లు పెరుగుతున్నాయి. మొదటి రోజు కన్నా శని, ఆదివారాల్లో కలెక్షన్లు ఎక్కువ వచ్చాయి.